ఖాయా.. పీయా.. వాపస్ ఆయా!
ఇక్కడ బీరాలు.. ఢిల్లీలో మూగనోము
ఎలాంటి ప్రణాళిక లేకుండానే ప్రధాని ముందుకు వెళ్లిన కార్పొరేటర్లు
రాజధానికి పైసా హామీ పొందని వైనం
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 7 (నమస్తే తెలంగాణ): వారంతా గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్లు.. ఒకసారి ఏకంగా జీహెచ్ఎంసీ కార్యాలయం మీదనే దాడిచేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడంతోపాటు గ్రేటర్ లోగోపై బ్లాక్ స్ప్రే చేసి తమ పైత్యాన్ని చాటుకున్నారు. మరోసారి గ్రేటర్ సర్వసభ్య సమావేశంలో మైకులు విరగ్గొట్టి… బూతులు అందుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఇదంతా హైదరాబాద్ అభివృద్ధి కోసమేనంటూ కవరింగ్ ఇచ్చుకొన్నారు.
సీన్ కట్ చేస్తే
ఈ కార్పొరేటర్లకు సువర్ణ అవకాశం లభించింది. తమను ఎన్నుకొన్న గ్రేటర్ ప్రజల రుణం తీర్చుకొనేలా ప్రధానితో భేటీ అయ్యే అవకాశం దొరికింది. నగరంలో తొడలు కొట్టే కార్పొరేటర్లు ప్రధాని ముందు పిల్లుల్లా మౌనం పాటించారు. ఇక్కడ గ్రేటర్ అభివృద్ధి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే వీరు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రయత్నించలేదు. వీరిని వెంట బెట్టుకుపోయిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ప్రధానితో కార్పొరేటర్లకు ఫొటో సెషన్ పెట్టించారే తప్ప హైదరాబాద్ అభివృద్ధిపై ఒక్కటంటే ఒక్క ప్రతిపాదన కూడా ఇవ్వలేదు.
ఇదీ.. కమలనాథుల తీరు!
గ్రేటర్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లను ప్రధాని వద్దకు తీసుకెళ్తానని గతంలో చెప్పిన బండి సంజయ్ మంగళవారం వారందరినీ ఢిల్లీ తీసుకెళ్లారు. మోదీతో గ్రూప్ ఫొటో దిగారు. కానీ హైదరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీతో ఒక్క నిమిషం కూడా చర్చంచలేదు. కేంద్రం నుంచి నగరానికి రావాల్సిన నిధులు, అనేక అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులు, మంజూరీలను ప్రస్తావించలేదు.
వీరికి నైతిక హక్కు ఎక్కడిది?!
ప్రధానితో భేటీ అయ్యే అవకాశం రావడమనేది మంచి అవకాశం. బీజేపీ నేతలు, కార్పొరేటర్లకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్కు ఎంతో కొంత మేలు జరిగేది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినవీరికి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్పొరేటర్లు ప్రధాని దృష్టికి తీసుకుపోయేందుకు అనివార్యమైన అంశాలు, సమస్యలను వారు ప్రస్తావిస్తున్నారు.
మీది ప్రభుత్వమా?.. ఎన్జీవోనా?
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లను కలిసి ఫొటోలు దిగిన తరువాత వాటిని ప్రధాని మోదీ సామాజిక సేవా తత్పరతపై విస్తృతంగా చర్చించామని ట్వీట్ చేయడంపై పరిశ్రమలమంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘మోదీ జీ! సామాజిక సేవా తత్పరత ఏమిటి? మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక ఎన్జీవో సంస్థనా? హైదరాబాద్ కు వరద సహాయం పై ఏదైనా సానుకూల స్పందన ఉన్నదా? మూసీ ఆధునీకరణకు ఆర్థిక సహకారం ఏదైనా ఉన్నదా లేదా? మెట్రో విస్తరణకు ఆర్థిక సహకారం ఉన్నదా? హైదరాబాద్ ఐటీఐఆర్పై అప్డేట్ ఏమైనా ఉన్నదా? లేక కేవలం హైదరాబాద్కు కేవలం పెదాలపై వచ్చే మాటలేనా? గుజరాత్కు మాత్రమే నిధులా?’ అని ప్రశ్నించారు.