హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున వ్యాఖ్యలు దురహంకారానికి పరాకాష్టగా రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అభివర్ణించారు. బీసీ ఉద్యమనేతగా గుర్తింపు తెచ్చుకున్న తనపై జమున వ్యాఖ్యల్ని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఏడున్నరేండ్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ వెంట హుజూరాబాబాద్ పరిధిలోని ఏ ఒక్క ప్రజాప్రతినిధి లేకపోవడమే ఆయనపట్ల ఆదరణ ఏపాటితో తెలుస్తున్నదని తెలిపారు. తాను విద్యార్థి దశ నుంచి ఉద్యమ జీవితం గడిపానని, నిరంతరం ప్రజల గొంతుగా నిలిచానని.. ఈటల రాజేందర్ వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలను వ్యాపారమయం చేశారని ఆరోపించారు. తాను బీసీ నేత ఆర్ కృష్ణయ్యతో కలిసి బీసీ వర్గాలకు అనేక స్కీములు పెట్టించగలిగానని గుర్తుచేశారు. అదే ఈటల అధికారాన్ని అడ్డంపెట్టుకొని స్కామ్లు చేశారని ఆరోపించారు. ఎంగిలిమెతుకులు తినాల్సిన అవసరం తనకు లేదన్నారు. తమ ఇంట్లో ఎప్పుడూ పోయ్యి వెలుగుతూ ఉంటుందని చెప్పుకుంటూనే ఇంటికి వచ్చి తినిపోయినవాళ్లను అవమానించటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. ఆత్మాభిమానం ముందు డబ్బూ, అధికారం పనికిరావని స్పష్టంచేశారు. ఈటల జమున మాటలు బడుగువర్గాల పట్ల ఆమె సహజనైజాన్ని బయటపెట్టాయని తెలిపారు.
తాను, ఈటల 2004లో ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించామని, తాను బీసీ హక్కుల కోసం పనిచేశానని చెప్పారు. 2009, 2010 తాను కాంగ్రెస్ అభ్యర్థిగా ఈటలపై పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయానని, అదే 2018 ఎన్నికల్లో ఈటల గెలుపు కోసం అహర్నిశలు పనిచేశానని పేర్కొన్నారు. వకుళాభరణం బాగా పనిచేశారని అనేకసార్లు చెప్పుకున్న ఈటలకు ఇప్పుడెందుకు ఇలా కనిపిస్తున్నానని ప్రశ్నించారు. 2004లో బీసీ సంక్షేమశాఖ (ప్రస్తుత రాజ్యసభ సభ్యులు) మంత్రి కెప్టెన్ లక్ష్మికాంతరావు తనను బీసీ కమిషన్ సభ్యుడిగా నియమించినప్పటి నుంచి నిబద్ధతతో పనిచేశానని, తెలంగాణ ఏర్పడిన తరువాత 2016లో సీఎం తనకు తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా నియమించిన తర్వాత బలహీనవర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశానని పేర్కొన్నారు. ఈటల రాజేందర్కు నిజంగా పదవులే ఇప్పింగలిగే శక్తి ఉంటే హుజూరాబాద్ నియోజకర్గంలో ఎంతమందికి పదవులు ఇప్పించారని నిలదీశారు. అక్రమాస్తులపై దర్యాప్తు జరుపుతుంటే వాటిని అడ్డుకోవాలని గగ్గోలుపెడుతున్నారని, అదే తాను ఏవైనా అక్రమాస్తులు సంపాదిస్తే వాటిపైనా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ ప్రతీసారి కేసీఆర్ బొమ్మపెట్టుకొని గెలిచారు. 17 ఏండ్లు ఎమ్మెల్యేగా.. ఏడేండ్లు మంత్రిగా ఉన్న తరువాత ఈటల బొమ్మ చూసి ప్రజలు ఓట్లేయరని తెలిసే కాంగ్రెస్, బీజేపీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలుస్తామని, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాలని ఆయన సవాల్ చేశారు.