నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 17: స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించారు. స్వాత్రంత్య్ర యోధుల స్ఫూర్తితో రక్తదానం చేసేందుకు ప్రజలు ముందుకొచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రక్తదాతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. రక్తదానంతో ప్రాణదాతలు కావొచ్చని పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో రక్తదాన శిబిరంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు.
పేదరికం, నిరుద్యోగం, మతతత్వం.. ఇవే దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మూడింటిని సమూలంగా రూపుమాపితేనే భారత్ ప్రపంచంలో నంబర్వన్ శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నదని చెప్పారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ హైదరాబాద్ నగరశాఖ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని స్వతంత్ర భారత వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావుతో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రారంభిం చారు. అనంతరం ఆమె రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఉచితాలంటూ కేంద్రం విమర్శించడంపై మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బుధవారం అరణ్యభవన్లో కలెక్టర్లు, అటవీ శాఖ, హెచ్ఎం డీఏ, జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. పల్లెలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల వద్ద మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్టు వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు వెల్లడిం చారు. పలువురు మంత్రులు, అధికారులతో బీఆరేఆర్ భవన్లో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముగింపు ఉత్స వాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారని చెప్పా రు. వేడుకల్లో శంకర్ మహదేవన్, శివమణి డ్రమ్స్, దీపికారెడ్డి బృందం నృత్య ప్రదర్శన, జానపద కార్యక్రమాలు, లేజర్షోతోపాటు పటాకులతో ప్రదర్శన ఉంటుందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం, దేశభక్తి ప్రధాన అంశాలుగా కార్యక్రమాలను రూపొందించా మని వెల్లడించారు. అన్ని జిల్లాల నుంచి 20 వేలకుపైగా మంది హాజరవుతారని తెలిపారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఫ్రీడం కప్ పేరిట గురువారం రాష్ట్రవ్యాప్తంగా క్రీడాపోటీలను నిర్వహించనున్నారు. మండల, జిల్లాస్థాయిల్లో ఉద్యోగులు, యువతీ యువకులకు పలువిభాగాల్లో ఆటల పోటీలు పెట్టనున్నారు. అన్ని ప్రభుత్వశాఖలను సమన్వయం చేస్తూ రాష్ట్ర క్రీడాశాఖ ఈ పోటీలను నిర్వహించనున్నది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.