హైదరాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ): రహదారి ప్రమాదాల నివారణ బాధ్యతను కీలకమైన ఐదు (రోడ్లు-భవనాలు, పోలీస్, వైద్యారోగ్య, విద్య, రవాణ) శాఖలకు అప్పగించాలని కేంద్రం భావిస్తున్నది. ఇందుకు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మార్గదర్శకాలను రూపొందిస్తున్నది. రాబోయే రెండు నెలల్లో వీటిని అమలు చేయనున్నట్టు సమాచారం. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే రహదారుల భద్రతపై దేశవ్యాప్తంగా ఐదేండ్లలో రూ.7,700 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. తెలంగాణకు దాదాపు రూ.700 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా ఏటా రూ. 60 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ నిధుల్లో ప్రపంచబ్యాంకు 25%, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 25%, కేంద్ర రవాణశాఖ 50% చొప్పున సమకూర్చనున్నాయి.
మార్గదర్శకాల రూపకల్పన పూర్తయిన తరువాత కేంద్రం, ప్రపంచబ్యాంకు, ఏడీబీ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర రవాణాశాఖ అధికారులు చెప్తున్నారు. ఆ తరువాత నిధులు విడుదల అవుతాయి. అనంతరం నిత్యం ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించి, వాటిని నివారించేందుకు ఇంజినీరింగ్ డిజైనింగ్ వర్క్ చేపడతారు. ఏ ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయో గుర్తించి చర్యలు తీసుకొంటారు. పోలీస్శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా రాష్ట్ర రోడ్లపై బ్లాక్స్పాట్లను గుర్తిస్తారు. ప్రమాదాల తీరు, మృతులు, క్షతగాత్రులు గాయపడిన తీరుపై వైద్యశాఖతో సమాలోచనలు చేస్తారు. రవాణాశాఖ ద్వారా ఆ ప్రాంతంలో వెళ్తున్న వాహనాల సరళి, వాటి లోడుకి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా డాటా సేకరిస్తారు. విద్యాశాఖ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చడంతో పాటు అవగాహన కార్యక్రమాలు విసృ్తతంగా నిర్వహించేలా చర్యలు తీసుకొంటారు.