హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎయిమ్స్ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించే సూపర్ స్పెషాలిటీ పీజీ ప్రవేశార్హత పరీక్షలో ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ చావా హర్షంత్ సాయిరామ్ ఫస్ట్ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. తన మామయ్య డాక్టర్ చంద్రకాంత్ స్ఫూర్తితో వైద్యవృత్తిని ఎంచుకున్నానని చెప్పారు. ఉస్మానియా వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ను, 2018-21 వరకు గాంధీ మెడికల్ కళాశాలలో ఎంఎస్ సర్జరీని పూర్తి చేశానని పేర్కొన్నారు. కొవిడ్ కాలంలో అనేకమంది బాధితులకు శస్త్రచికిత్సలు చేశానని వెల్లడించారు. ఎయిమ్స్లో సూపర్స్పెషాలిటీ సర్జరీలో పీజీ చేయాలని పరీక్ష రాయగా, మొదటి ర్యాంకు రావడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయం సాధించానని వివరించారు.