హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న ఓ పురుషుడిలో స్త్రీ జననాంగాలు ఉన్నట్టు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు గుర్తించారు. అరుదైన శస్త్రచికిత్సతో వాటిని గుర్తించి తొలగించారు. మంచిర్యాలకు చెందిన ఆ వ్యక్తిలో చిన్ననాటి నుంచే హార్మోన్లు తగినంత స్థాయిలో విడుదల కాకపోవడంతో స్త్రీ, పురుష పునరుత్పత్తి అవయవాలు రెండింటినీ కలిగి ఉన్నాడని కిమ్స్ వైద్యుడు డాక్టర్ వైఎం ప్రశాంత్ తెలిపారు. అతడిలో వృషణాలు ఉదర భాగంలో ఉండటంతో వీర్యకణాల ఉత్పత్తి జరగలేదని, దీనితోపాటు ఆడవాళ్లకు మాత్రమే ఉండే గర్భసంచి, ఫెలోపియన్ ట్యూబ్లు, పెర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్తో బాధపడుతున్నాడని వివరించారు. దీంతో అతనిలో ఉన్న స్త్రీ పునరుత్పత్తి అవయవాలన్నింటిని విజయవంతంగా తొలగించామని చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదని, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 300, మన దేశంలో 20 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.