నల్లగొండ : మద్యానికి బానిసైన తండ్రి నిత్యం తాగొచ్చి గొడవ చేస్తుండడంతో విసిగిపోయిన కొడుకు రోకలిబండతో దాడి చేశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన తండ్రి మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మాపురం గ్రామానికి చెందిన కోమండ్ల బ్రహ్మం (46) గ్రామంలో తనకున్న భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి వివాహం కాగా, కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన బ్రహ్మం నిత్యం తాగి వచ్చి భార్య అలివేలుతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి తాగొచ్చి భార్యతో గొడవకు దిగగా ఆవేశానికి గురైన కొడుకు రమేశ్ రోకలి బండతో తండ్రి తలపై కొట్టాడు. దాంతో బ్రహ్మం తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కొండమల్లేపల్లి ఇన్చార్జి సీఐ విఠల్రెడ్డి, గుడిపల్లి ఎస్ఐ వీరబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి సోదరుడు కోమండ్ల విష్ణు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.