హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నందున భద్రాచలంలో హెలికాప్టర్ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వరద బాధితులను రక్షించే కార్యక్రమాల్లో పాల్గొనేవారికి అవసరమైన లైఫ్జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రిని అదనంగా తరలించాలని సూచించారు. భద్రాచలంలో వరద పరిస్థితులను పర్యవేక్షిస్తున్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో మంత్రి పువ్వాడ, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి కలిసి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో పునరావాస చర్యలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సకాలంలో వరద సహాయాన్ని అందించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వరద సహాయక చర్యలను సమర్థంగా చేపట్టేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి, రెస్యూ టీమ్లను భద్రాచలం, కొత్తగూడెం పట్టణాల్లో సిద్ధంగా ఉంచాలని సూచించారు. వరద నీరు 80 అడుగులకు చేరినా సమర్థవంతంగా ఎదురొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. ముంపునకు గురయ్యే గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి ప్రత్యేక పునరావాస శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే భద్రాచలంలో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీకి చెందిన 5 బృందాలు, సింగరేణి రెస్యూ టీమ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
భద్రాద్రికి రానున్న 101 మంది సభ్యుల సైనిక బృందం
ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు పునరావాస చర్యల్లో పాల్గొనడానికి 101 మందితో కూడిన సైనిక బృందం రాష్ర్టానికి వస్తున్నదని సోమేశ్కుమార్ తెలిపారు. ఇందులో 68 మందితో కూడిన ఇన్ఫాంట్రీ, 10 మందితో కూడిన వైద్య బృందం, 23 మందితో కూడిన ఇంజినీరింగ్ సభ్యుల బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రానున్నాయని వెల్లడించారు. శుక్రవారం రాత్రికల్లా ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ భద్రాచలానికి చేరుకొంటుందని తెలిపారు. సహాయ, పునరావాస చర్యల కోసం పర్యాటకశాఖకు చెందిన ప్రత్యేక బోట్లు, సిబ్బందిని భద్రాచలంకు పంపించినట్టు తెలిపారు. ఇప్పటికే 7 బోట్లు, లైఫ్ జాకెట్లు కలిగిన 210 మంది స్విమ్మర్లు అందుబాటులో ఉన్నారని చెప్పారు. సహాయక చర్యల్లో జిల్లా యంత్రాంగానికి తోడ్పాటుగా మరో నలుగురు ఆర్డీవోలను నియమించినట్టు తెలిపారు. సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు, పర్యవేక్షించేందుకు పోలీసు ఉన్నతాధికారులకు కూడా బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. భద్రాద్రి జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి, సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ను ప్రత్యేక అధికారిగా నియమించినట్టు తెలిపారు. వరదల సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని, సహాయక శిబిరాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద పరిస్థితులపై సంబంధిత అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సమీక్షిస్తున్నట్టు తెలిపారు.