Majha Ghar | మహారాష్ట్రలో అన్నదాతల పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది. సాగునీరు లేక.. పంటలు పండక.. పండిన పంటలకు గిట్టుబాటు లేక అప్పులపాలు కావడంతో ఏటా వేలాదిమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో అన్నదాతల కుటుంబాలు ఆగమైపోతున్నాయి. వారి పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతున్నది. ఈ దుర్భర పరిస్థితిని చూసి చలించిపోయిన లాతూర్ జిల్లాకు చెందిన యువ దంపతులు విధివంచిత బాలలను అక్కున చేర్చుకొంటున్నారు. ‘మాఝా ఘర్’ పేరుతో విద్యాలయాన్ని స్థాపించి రైతన్నల బలవన్మరణంతో చిక్కిశల్యమైన బాల్యం భవితకు బంగారు బాటలు వేస్తున్నారు.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర రైతులు 50 ఏండ్లలో ఎన్నడూలేని దయనీయ, దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిరుడు మరాఠ్వాడ, విదర్భ ప్రాంతానికి చెందిన 1200 మంది యువరైతులు ఆత్మహత్య చేసుకొన్నట్టు మహారాష్ట్ర సర్కారు లెక్కలు చెప్తున్నాయి. సర్కారు లెక్కలోకి రాని రైతు ఆత్మహత్యలు అదేస్థాయిలో ఉంటాయని మేధావులు చెప్తున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, పంట కోసం చేసిన అప్పులు కట్టలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరోవైపు మరణించిన రైతు కుటుంబాల్లోని చిన్నారుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. వారు బాలకార్మికులుగా మారుతున్నారు. బంగారు బాల్యం చిక్కిశల్యమైపోతుంటే చూసి చలించిపోయిన లాతూర్ జిల్లా బుదోడాకు చెందిన యువ దంపతులు శరత్ కేశవ జరే, సంగీతవేణి నాలుగేండ్ల క్రితం ‘మా ఇల్లు’ (మాఝా ఘర్) అనే విద్యాలయాన్ని స్థాపించారు. ఇంటిపెద్ద బలవన్మరణంతో విద్యకు దూరమవుతున్న చిన్నారులను చేరదీసి, విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.
అభాగ్యుల బ(ఒ)డి మాఝా ఘర్
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా అమరావతి-నాగ్పూర్రోడ్లోని బుదోడా అనే గ్రామంలో మాఝా ఘర్ (మా ఇల్లు…మనుష్య ఇన్స్టిట్యూట్)ను శరత్ కేశవ జరే, సంగీతవేణి అనే విద్యావంతులైన దంపతులు స్థాపించారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడిన, పనికోసం వలసపోయిన రైతులు, మద్యానికి బానిసైన వారి కుటుంబాల్లోని పిల్లలను అక్కున చేర్చుకొంటున్నారు. లాతూర్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన విధి వంచిత బాలలకు ఆశ్రయం కల్పించి, చదువు చెప్తున్నారు.
పిల్లలకు ప్రాథమిక విద్య వరకు మాఝా ఘర్లోనే శరత్ కేశవ జరే, సంగీత వేణి ఇద్దరూ చదువు చెప్తారు. ప్రాథమికోన్నతస్థాయి నుంచి హైస్కూల్ దాకా లాతూర్ లేదా ఆ సమీప ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వారిని చేర్పిస్తారు. స్కూల్ వేళలు పూర్తికాగానే విద్యార్థులు తిరిగి మాఝా ఘర్కు చేరుకొంటారు. మొత్తంగా ఇది ఆ విద్యార్థులకు సొంత ఇల్లులాంటిది. ప్రస్తుతం ఇందులో 70 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 22 మంది బాలికలు చదువుకొంటున్నారు. తన స్నేహితులు, దాతలు ఇచ్చిన విరాళాలతో మాఝూ ఘర్ను నడుపుతున్నట్టు శరత్ కేశవ జరే పేర్కొన్నారు.
ఎవరీ శరత్ కేశవ జరే?
శరత్ కేశవ జరే.. మొదటి నుంచి అభ్యుదయ భావాలు, సామాజిక బాధ్యతలున్న వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. 40 ఏండ్లున్న శరత్కేశవ జరే తన 21వ ఏటే బుదోడా గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. అనంతరం రాజకీయాలనుంచి తప్పుకొని జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. దేశ సేవక్, లోక్మత్ పత్రికల్లో కొంతకాలం పనిచేశారు. నాలుగేండ్ల క్రితం మాఝా ఘర్ అనే విద్యాలయాలన్ని స్థాపించి, విధివంచిత బాలలకు విద్యాదానం చేస్తున్నారు.
రైతుల తలరాత మార్చేవారికోసం ఎదురుచూపులు
రైతుల ఆత్మహత్యలు శాశ్వతంగా ఆగే కాలం కోసం మహారాష్ట్ర ఎదురుచూస్తున్నది. తమ తలరాతను మార్చే వారి కోసం చూస్తున్న మహారాష్ట్ర అన్నదాతలకు కేసీఆర్ తెలంగాణ మాడల్ కొత్త ఆశలను రేకిత్తిస్తున్నది. తెలంగాణతరహా రైతు సంక్షేమ పథకాలు మహారాష్ట్రలోనూ అమలుకావాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. మహారాష్ట్రలో కేసీఆర్పై ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది. చిన్న పిల్లల తల్లిదండ్రులు (తల్లి లేదా తండ్రి) ఆత్మహత్యలు చేసుకోవటం, బతుకుదెరువు కోసం వలసలు వెళ్లడం ఆగాలని మాఝా ఘర్ కోరుకుంటున్నది. ఈ దయనీయ పరిస్థితిని మార్చేందుకు ఎవరు ముందుకొచ్చినా మా మద్దుతు వారికి ఉంటుంది.
–శరత్ కేశవ జరే, మాఝూ ఘర్ వ్యవస్థాపకుడు
ఆదర్శ యువ దంపతులు
శరత్, సంగీతవేణి విద్యావంతులైన యువ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల పిల్లల భవిష్యత్తు అంధకారం కాకుండా ఆదుకొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారిని అభినందించాం. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ కార్యాచరణను చూసి ఆ యువ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు శాశ్వతంగా భరోసా ఇచ్చే కేసీఆర్లాంటి నాయకుడు మహారాష్ట్రకు రావడాన్ని స్వాగతించారు. మాఝా ఘర్ నిర్వహణకు తమ వంతుగా సహాయం చేస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు.. మాఝా ఘర్ నేపథ్యం గొప్పది.
–మాణిక్ కదమ్, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు