జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని సీడ్స్, ఫర్టిలైజర్ షాపులను ఏడీఏ ప్రదీప్ కుమార్, టాస్క్ ఫోర్స్ సీఐ రాంబాబు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా షాపుల్లో రికార్డులను పరిశీలించారు. కాలపరిమితి దాటినా విత్తనాలు అమ్ముతున్న రెండు షాపుల యజమానులపై కేసులు నమోదు చేశారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమాలకు పాల్పడేవారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రశీదులు పొందాలని సూచించారు. అక్రమార్కుల వివరాలను టాస్క్ఫోర్స్ అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి, జనగామ ఏవోలు మురళీ మోహన్, కరుణాకర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.