హైదరాబాద్ : ప్రతి ఒక్కరికీ స్వచ్ఛతపై అవగాహన ఉన్నప్పుడే రాష్ట్రం స్వచ్ఛ తెలంగాణగా రూపు దిద్దుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita Indra Reddy) అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్ల నిర్మాణం, జల్పల్లి కమాన్ వద్ద జల్పల్లి అర్బన్ ఫారెస్ట్లో చిల్డ్రన్ పార్కును, మన ఊరు-మన బడి కింద అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణ ప్రగతికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) సహకారంతో మహేశ్వరం నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కోట్లాది రూపాయలతో అభివద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.
నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ వసంత, డీఈ వెంకన్న, ఏఈ ఆయేషా, కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.