Padi Kaushik Reddy | హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలపై ఈ నెల ఆగస్ట్ 29న అసెంబ్లీ కమిటీ హాల్–1లో ఉదయం 11 గంటలకు ఎథిక్స్ కమిటీ భేటీ కానున్నది. కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై కమిటీ విచారించనున్నది. కాగా, ‘ఎథిక్స్ కమిటీ పేరిట కాంగ్రెస్ సర్కార్ ప్రతిపక్షంపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని బలిచేసేందుకు కుట్రలు చేస్తున్నది’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి రేవంత్రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘నిండు శాసనసభలో బడివే, పండబెట్టి తొక్కుతా, బట్టలూడదీసి కొడుతా, మా దగ్గర కండలు తిరిగినోళ్లున్నరు.. బోర్ల వేసి కొడ్తం.. అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ‘అరేయ్ తోలుతీస్తా, బయట తిరుగనివ్వను’ అని దానం నాగేందర్, ‘పరికత్తులు లేస్తే మీ తలలు తెగుతయ్.. కత్తులతో కోలాటమాడుతా’ అని మందుల సామేల్ బెదిరింపులు, ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ అసభ్య సైగలు ఎథిక్స్ కమిటీ కిందికి రావా? అని సూటిగా ప్రశ్నించారు.
వారు మాట్లాడిన మాటలు, చేసిన చేష్టల వీడియోలు చూపుతూ ధ్వజమెత్తారు. కౌశిక్రెడ్డి ప్రవర్తనపై చర్చించి చర్యల సిఫార్సుకు ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటుచేసినట్టు నోటీసు వచ్చిందని, అయితే కౌశిక్ వ్యవహారాన్ని సిఫార్సు చేసిన సమయంలో ఎథిక్స్ కమిటీ మనుగడలో లేదని తెలిపారు. అసలు కమిటీ లేనప్పుడు ఆ వ్యవహారాన్ని ఎలా రెఫర్ చేస్తారని ప్రశ్నించారు. దీనిని బట్టి కక్ష సాధింపు చర్యగా అర్థమవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన కడియం శ్రీహరి అదే ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని కౌశిక్ ఆక్షేపించారని తెలిపారు.