హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ సహా అన్ని యూజీ కోర్సుల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ను మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టాలని సైయెంట్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి సూచించారు. డిగ్రీ స్థాయిలోనే ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రవేశపెట్టడం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని, ఐఐటీహెచ్లో తాము మైనర్ డిగ్రీని విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. జేఎన్టీయూ, తెలంగాణ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో నిర్వహిస్తున్న అఖిల భారత సాంకేతిక విశ్వవిద్యాలయాల వీసీల రెండు రోజుల సదస్సు శుక్రవారం హైదరాబాద్లోని ఆవాసా హోటల్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నిపుణులను విద్యావ్యవస్థ తయారు చేయడంలేదని చెప్పారు.
పీజీ కోర్సుల్లో 76శాతం మహిళలే..
పీజీ కోర్సుల్లో 76 శాతం మహిళలే ఉన్నారని, ఇది ఆహ్వానించదగిన పరిణామమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచీకరణకు అనుగుణంగా సాంకేతిక విద్యను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని అన్నారు. వర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ బీజే రావు మాట్లాడుతూ.. సాంకేతిక విద్యార్థులు ఉద్యోగాలు వెతుకొనే స్థాయి నుంచి ఉపాధి సృష్టించేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వర్సిటీలపై ఉన్నదన్నారు. సదస్సులో వీసీలు ప్రొఫెసర్ రవీందర్ గుప్తా, ప్రొఫెసర్ గోపాల్రెడ్డి, ప్రొఫెసర్ కవిత ధర్యానిరావు, ప్రొఫెసర్ డీ రవీందర్, ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, జేఎన్టీయూహెచ్ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్హుస్సేన్, రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డి, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.