హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభం అనేక మంది ఉపాధిని దెబ్బతీసింది. అదే సమయంలో ప్రభుత్వం అందించిన రుణాలు రాష్ట్రంలోని ఎన్నో స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలకు) ఉపాధి కల్పించాయి. మహిళలను వ్యాపారవేత్తలుగా (ఎంటర్ప్రెన్యూర్స్గా) నిలబెట్టి వారి కుటుంబాలకు ఆసరా అయ్యాయి. గ్రామాల్లో కొత్తతరం కుటుంబాలు వ్యాపారరంగంలోకి మళ్లుతుండటంతో మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఫలిస్తున్నది. నిన్నమొన్నటి వరకు మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల నుంచి రూ.5 లక్షల వరకు రుణం తీసుకొని ఆ మొత్తాన్ని రూ.50 వేల చొప్పున సమానంగా పంచుకొనేవారు. వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఈ నిధులు ఏమాత్రం సరిపోయేవి కాదు. దీంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్జీల రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలో బ్యాంకు రుణాన్ని పంచుకునే విధానానికి స్వస్తి పలికి సంఘంలో అవసరమున్న మహిళలకు అవసరమైతే లక్ష నుంచి మూడు లక్షల వరకైనా రుణాన్ని ఇప్పించి వ్యాపారులుగా మార్చాలని సెర్ప్ అధికారులు నిర్ణయించారు. మహిళలకు ఆదాయ మార్గాలను చూపి పెట్టుబడులను సమకూర్చడం ద్వారా వారి ఆదాయాన్ని, జీవన ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెర్ప్ సీఈవో, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ప్రతి నెలా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి ఈ లక్ష్య సాధనకు కృషిచేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేయించేందుకు 17,814 గ్రామ సమాఖ్యల పరిధిలోని ఎస్హెచ్జీల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50 వేలమందిని ఎంపిక చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకొన్నారు. కానీ కరోనా ప్రభావంతో అనేక మంది ఉపాధిని కోల్పోవడంతో వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు డిమాండ్ పెరిగింది. దీంతో 62,575 మంది మహిళలను వ్యాపారులుగా మార్చేందుకు రూ.1200 కోట్లకుపైగా రుణాలు అందించాలని నిర్ణయించారు. తదనుగుణంగా ఇప్పటికే 44,302 మందిని ఎంపికచేసి రుణాలను అందించడంతో తొలి ఆరు నెలల్లో 71% లక్ష్యం పూర్తయింది. ఇంకా మరో 18,273 యూనిట్లను ఏర్పాటు చేయించాల్సి ఉన్నది.
మహిళా సంఘం ద్వారా మాకు బ్యాంకు నుంచి రూ.3 లక్షల రుణం ఇప్పించారు. ఇది మా జీవితాన్ని మార్చేసింది. ఈ రుణంతో గ్రామంలోనే భూమిని లీజుకు తీసుకొని హోటల్ పెట్టాం. మా ఇంట్లోని నలుగురికీ పని దొరికింది. ఇప్పుడు మా కాళ్ల మీద మేం నిలబడగలిగాం. మా హోటల్లో రోజూ రూ.15వేల వరకు గిరాకీ అయితాంది. దీంతో ప్రతి నెలా బ్యాంకుకు రూ.15 నుంచి రూ.20 వేల వరకు లోను కడుతున్నాం. హోటల్ను మంచిగా నడిపిస్తున్నామని ఆగస్టు 15న మా జిల్లా కలెక్టరమ్మ అవార్డు కూడా ఇచ్చింది.
సాదెల్లి కొమురమ్మ, వడ్డిచర్ల గ్రామం, లింగాలఘనపురం మండలం, జనగామ జిల్లా
నేను మహిళా సంఘంలో 15 సంవత్సరాలు సభ్యురాలిగా ఉన్నాను. గతంలో సంఘం నుంచి తీసుకునే రుణాన్ని వ్యవసాయ పనులకు, ఇతర ఖర్చులకు ఉపయోగించేవాళ్లం. మా ఆయన దుబాయ్లో పనిచేసే వాడు. కరోనాతో తిరిగి వచ్చాడు. మళ్లీ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఈ తరుణంలో సెర్ప్ అధికారులు రూ.లక్ష రుణం ఇప్పించారు. కమ్మర్పల్లిలో మినీ సూపర్ మార్కెట్ పెట్టాం. నేను , మా ఆయన ఇద్దరం ఇందులో పనిచేస్తాం. నేను వీవోఓగా కూడా పనిచేస్తా. మా సూపర్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే మంచి గిరాకీ అయితాంది. నెలకు రూ.4 వేలు బ్యాంకు లోను కడుతున్నాం. దీన్ని ఇంకా మంచిగా నడిపించుకొని ఎదగాలని చూస్తున్నాం.
దుంపల లత, కమ్మర్పల్లి, నిజామాబాద్ జిల్లా