హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులు లా కోర్సుల్లో చేరడం సహజం. కానీ, గత కొంతకాలంగా ఇంజినీరింగ్ విద్యార్థులు లా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది 4,383 మంది విద్యార్థులు లాసెట్ ఎంట్రెన్స్కు దరఖాస్తు చేసుకొన్నారు. వీరే కాకుండా 67 మంది ఎంబీబీఎస్, 36 మంది బీడీఎస్, 23 మంది బీఆర్క్, 18 మంది బీహెచ్ఎంఎస్ , 12 మంది బీఏఎంఎస్ కోర్సుల విద్యార్థులు ఈ ఏడాది లాసెట్ రాసి న్యాయవాద కోర్సుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. మూడేండ్ల లా కోర్సుకు 24,938 మంది అభ్యర్థులు, ఐదేండ్ల లా కోర్సుకు 7,507 మంది అభ్యర్థులు, ఎల్ఎల్ఎం కోర్సుకు 3,093 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 35,538 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 21న ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మూడేండ్ల లా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐదేండ్ల లా, 22న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎల్ఎల్ఎం కోర్సుకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. హాల్టికెట్లను https://lawcet.tsche.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు.