హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. మార్చి 25 లోపు పనులు పూర్తి చేసి ఎఫ్టీవోలను అప్లోడ్ చేస్తే ఆ నిధులు త్వరగా వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. శుక్రవారం బీఆర్కే భవన్ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీఆర్డీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న మెటీరియల్ కాంపోనెంట్ నిధుల ఆధారంగా పనులు చేపట్టాలని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీ భవనాల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడవద్దని ఆయన అధికారులకు సూచించారు. ఈ కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.