హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఉర్దూ దినపత్రిక రెహనుమా ఎ దక్కన్ ప్రధాన సంపాదకుడు, ఇండో-అరబ్ లీగ్ చైర్మన్ సయ్యద్ వికారుద్దీన్ (82) ఇక లేరు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని ఓ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనల అనంతరం హుస్సేనీ ఆలంలోని మూసా ఖాద్రీ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. వికారుద్దీన్ మరణం పట్ల సీఎం కేసీఆర్తోపాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జర్నలిస్టుగా, ఇండో-అరబ్ లీగ్ చైర్మన్గా లౌకిక వ్యవస్థ బలోపేతానికి వికారుద్దీన్ విశేష సేవలందించారని సంతాప సందేశంలో పేర్కొన్నారు.
వికారుద్దీన్ మరణం చాలా విచారకరమని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉర్దూ జర్నలిజానికి వికారుద్దీన్ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
ఉర్దూ జర్నలిజంలో ప్రత్యేకస్థానాన్ని ఏర్పాటుచేసుకొన్న వికారుద్దీన్ మరణం పట్ల ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వై నరేందర్రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే విరాహత్ అలీ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మృతి మీడియా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. వికారుద్దీన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.