హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో క్యాసినోలు నిర్వహించి హవాలా లావాదేవీలు జరిపినట్టు నమోదైన కేసులో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి వరుసగా రెండో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఇటీవల ప్రవీణ్, మాధవరెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాల సందర్భంగా సేకరించిన ఆధారాలతో ఈడీ అధికారులు సోమవారం వారిద్దరినీ రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించిన విషయం విదితమే.
మంగళవారం ఈడీ అధికారులు మరోమారు ప్రవీణ్, మాధవరెడ్డిని వేర్వేరుగా ప్రశ్నించి, పలు కీలక వివరాలను రాబట్టినట్టు సమాచారం. ఈ విచారణలో ప్రవీణ్, మాధవరెడ్డి మరో నలుగురు హవాలా ఏజెంట్లు, వారి బ్యాంకు లావాదేవీల వివరాలను ఈడీ అధికారులకు సమర్పించినట్టు తెలుస్తున్నది.