Earthquakes | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గతంతో పోల్చితే ఈ ఏడాది దేశంలో భూకంపాలు రెట్టింపు అయ్యాయి. 2020 నుంచి ఇప్పటివరకు భూకంపాల వివరాలు ఇవ్వాలని ఓ ఎంపీ కోరగా, కేంద్రం బుధవారం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం 2020 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు నాలుగేండ్లలో మొత్తం 310 భూకంపాలు సంభవించాయి. నిరుటితో పోల్చితే ఈసారి భూకంపాల సంఖ్య రెట్టింపయ్యింది.
2020లో 61, 2021లో 60, 2022లో 64 భూకంపాలు నమోదు కాగా.. ఈ ఏడాది 11 నెల్లలోనే 124 ప్రకంపనలు రికార్డయ్యాయి. ఇందులో 97 ప్రకంపనల 3.9 లోపే నమోదు కావడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. పశ్చిమ నేపాల్లోని ఆల్మోరా ఫలకం యాక్టివ్ కావ డం వల్లే భూకంపాల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. దీనివల్ల ఈ ఏడాది జనవరి 24న (5.8 తీవ్రతతో), అక్టోబర్ 3న (6.2 తీవ్రతతో), నవంబర్ 3న (6.4 తీవ్రతతో) భారీ భూకంపాలు సంభవించాయని వెల్లడించారు. వీటి ప్రభావంతో హిమాలయాల చుట్టూ భూకంపాలు కొనసాగాయని, తక్కువ స్థాయిలో వరుస ప్రకంపనలు నమోదయ్యాయని తెలిపారు. 2020తో పోల్చితే భారీ భూకంపాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది.