హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): పెద్దపులుల అభయారణ్యమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ -ఐ(ఈ -కన్ను) నిఘా వ్యవస్థ సత్ఫలితాలిస్తున్నది. పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు, వాటి సంరక్షణకు, అటవీ ఆక్రమణలు, జంతువుల వేట, కలప స్మగ్లింగ్ను అడ్డుకునేందుకు బాగా ఉపయోగపడుతున్నది. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతకాలం క్రితమే ప్రయోగాత్మకంగా ఏటీఆర్లో అధికారులు చేపట్టారు. ప్రస్తుతానికి 10 కెమెరాలను వినియోగంలోకి తేగా, పులులు, ఇతర జంతువుల లైవ్ వీడియోలు, ఫొటోలు అబ్బురపరిచే విధంగా ఉన్నట్టు అటవీ అధికారులు పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో పెద్దసంఖ్యలో అటవీ సిబ్బందిని నియమించాల్సిన అవసరం లేకుండా, కీలకమైన, క్లిష్టమైన ప్రదేశాల్లో వారానికి ఏడు రోజులు, 24 గంటల పాటు ఖచ్చితంగా అటవీ ప్రాంతాన్ని పర్యవేక్షించేందుకు దీని ద్వారా వీలు కలిగింది. సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవస్థ ద్వారా పనిచేసే ఈ విధానంలో.. వివిధ సెన్సిటివ్ జోన్లలో హై రిజల్యూషన్ థర్మల్, ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా మనుషులు, పులుల కదలికలను రికార్డ్ చేశారు. ఉన్నతాధికారుల సెల్ఫోన్కు జంతువుల కదలికలు, ఇతర ఘటనలకు సంబంధించిన అలర్ట్లు, నోటిఫికేషన్లు వచ్చే సాంకేతికతను ఏర్పాటు చేశారు. అడవిలో ఇంటర్నెట్ నెట్వర్క్ కవర్ కాని చోట్ల రేడియో ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కు దృశ్యాలు కన్వర్టయ్యే స్ట్రీమింగ్తో ఎక్కడి నుంచైనా లైవ్లో మానిటర్ చేసే అవకాశాలుండటం అధికారులకు ఉపకరిస్తున్నది. బీట్ ఆఫీసర్లు నెలలో 26 రోజుల పాటు రాత్రి వేళ అడవిలో తిరుగుతూ నరికిన చెట్లను, ఇతర వివరాలను గుర్తించి పైఅధికారులను అలర్ట్ చేయాలి. ప్రస్తుతం ఈ-ఐ ఏర్పాటుతో వీరి పని సులభంగా మారింది. దీనిని మరింత విస్తృతపరచాలని అధికారులు నిర్ణయించారు.