మియాపూర్, మే 2: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుర్గం చెరువు వద్ద ఏర్పాటు చేసిన 30 అడుగుల వాచ్ టవర్ను డీజీపీ మహేందర్రెడ్డి సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఐటీ ప్రాంతానికి వేదికైన దుర్గం చెరువు, పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘాకు ఈ వాచ్ టవర్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. దీనికి తోడు 67 సీసీ కెమెరాలను సైతం ప్రారంభించామని, దుర్గం చెరువు పరిసరాల్లో నాలుగున్నర కిలోమీటర్ల మేర ప్రతి అంగుళం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుందని వివరించారు.
ప్రజారక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, నేరం చేసే వారెవరూ తప్పించుకునే ఆస్కారం లేకుండా పటిష్ఠమైన సాంకేతిత వ్యవస్థతో పోలీసుశాఖ పనిచేస్తున్నదని పేర్కొన్నారు. చెరువు లోపల నిరంతర గస్తీకి బ్యాటరీ బోట్ను, చెరువు చుట్టూ గస్తీకి బ్యాటరీ సైకిళ్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. సీఎస్ఆర్ కింద దుర్గం చెరువు వద్ద వాచ్ టవర్ ఏర్పాటు చేసిన రహేజా ఐటీ సంస్థ ప్రతినిధులను డీజీపీ అభినందించారు.