న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. గడిచిన 24 గంటల్లో భారత్లో 43 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించారు. ఒక్కరోజులో ఇంతటి భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ చేపట్టడం రికార్డుగా అధికారులు పేర్కొన్నారు.
ఇక రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల కట్టడిపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మహమ్మారి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.