వరంగల్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికతో చారిత్రక నగరం వరంగల్ సరికొత్తగా మారుతున్నది. దేశ వారసత్వ నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన వరంగల్లోని జైన క్షేత్రం అగ్గలయ్య గుట్టను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ చొరవతో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుట్టపైన ఉన్న శిల్పాల వద్దకు చేరుకొనేందుకు వీలుగా 300 మెట్లను నిర్మించారు. అగ్గలయ్య గుట్టపై పార్కు, రాత్రి వేళల్లో సందర్శనకు అనుగుణంగా లైట్లు, ప్రధాన ద్వారం పనులు చేపట్టడంతో ఈ ప్రాంతానికి పర్యాటక కళ వచ్చింది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. అగ్గలయ్య గుట్ట ప్రముఖ జైన క్షేత్రంగా గుర్తింపు పొందింది. అగ్గలయ్యకు గొప్ప వైద్యుడిగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
అగ్గలయ్య జనగామ పరిసర ప్రాంతాల్లో ఖనిజ ఔషధ నిర్మాణ కేంద్రాలను నెలకొల్పి వైద్య సేవలు అందించినట్టు సైదాపూర్ శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కాలంలో హనుమకొండలోని అగ్గలయ్యగుట్ట వైద్య కేంద్రంగా ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. వెయ్యేండ్ల క్రితమే తీవ్రమైన వ్యాధులను నయం చేసిన వైద్య నిపుణుడిగా అగ్గలయ్యకు గుర్తింపు ఉన్నది. అగ్గలయ్య పేరుతో హన్మకొండలో 30 అడుగుల విగ్రహంతో గుట్ట ఉన్నది. ఈ ప్రాంతంలోనే అగ్గలయ్య వైద్య కేంద్రాలు నిర్వహించినట్టు చరిత్ర పరిశోధకులు నిర్ధారించారు. అగ్గలయ్య వైద్య సేవలతోపాటు హనుమకొండ కేంద్రంగా ఎందరికో వైద్యశాస్ర్తాన్ని బోధించాడు. అప్పట్లోనే శస్త్రచికిత్సలు చేసిన వైద్య రత్నాకరుడిగా అగ్గలయ్యకు పేరున్నది. అగ్గలయ్యగుట్టపై ఉత్తరాభిముఖంగా 16వ జైనతీర్థంకుడు శాంతినాథుని 30 అడుగుల నిలువెత్తు అర్ధశిల్పం ఉన్నది. ఇక్కడి నుంచి 54 మెట్లపైన అగ్గలయ్య శిల్పం ఉన్నది.