హైదరాబాద్, మే 3, (నమస్తే తెలంగాణ): ఆక్సిజన్ కొరత లేకుండా రాష్ట్రప్రభుత్వం అప్రమత్తతతో చర్యలు తీసుకుంటున్నది. ముందుగానే ఆక్సిజన్ అవసరాన్ని గుర్తించిన సర్కారు సైనిక విమానాల్లో, రైళ్లలో ఖాళీ ట్యాంకర్లను ఒడిశాకు పంపి, రాష్ర్టానికి తీసుకొని వస్తున్నది. నిరాటంకంగా ఆక్సిజన్ సిలిండర్లు ఒడిశా నుంచి రాష్ర్టానికి తెప్పించేందుకు రవాణాశాఖ చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ కే పాపారావు తెలిపారు. గత నెల 26 నుంచి ఇప్పటి వరకు మొత్తం 155 ఆక్సిజన్ ట్యాంకర్లను పంపి వాటి ద్వారా 2,649.13 టన్నుల ఆక్సిజన్ను తెప్పించినట్టు ఆయన పేర్కొన్నారు. 9 యుద్ధ విమానాల ద్వారా 30 ట్యాంకర్లు పం పి 442 టన్నుల ఆక్సిజన్, రెండు ట్రైన్ల ద్వారా 9 ట్యాంకర్లు పంపి 129 టన్నులు, రోడ్డు మార్గాన పంపిన 93 ట్యాంకర్ల ద్వారా 1,725.1 టన్నులు, ఇతర వనరుల ద్వారా 23 ట్యాంకర్లలో 353.03 టన్నుల ఆక్సిజన్ను రాష్ర్టానికి తెప్పించినట్టు వివరించారు. రోడ్డుమార్గాన తరలించే సమయంలో ఆటంకాలు ఎదురుకాకుండా జీపీఎస్ ట్రాకింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్కో ట్యాంకరుకు ఇద్దరు చొప్పున డ్రైవర్లను వినియోగిస్తున్నామని, 15-20 మంది ఆర్టీసీ డ్రైవర్లు కూడా సేవలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నిరంతర పర్యవేక్షణ
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ నేతృత్వంలో నిరాటంకంగా ఆక్సిజన్ సిలిండర్లు రాష్ర్టానికి తెప్పిస్తున్నాం. ట్యాంకర్ల సేకరణ, వాటిని సైనిక విమానాలు, రైళ్లలో ఒడిశాకు పంపడం, తిరిగి ఇక్కడికి చేరేవరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. చెక్పోస్టుల దగ్గర ఎన్ని ట్యాంకర్లు వస్తున్నాయి, వెళ్తున్నాయని చూస్తున్నాం. ఒక్కో ట్యాంకర్కు ఇద్దరు చొప్పున డ్రైవర్లను పెట్టడంతో వీలైనంత తక్కువ సమయంలోనే ట్యాంకర్లు మన రాష్ర్టానికి చేరుతున్నాయి.