హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్(టీజేఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హనుమంతు ముదిరాజ్ ప్రకటించారు. బుధవారం టీజేఎంయూ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. టీజేఎంయూ నాయకులు ఈ నెల 24 నుంచి ఆమరణ నిరాహారదీక్షల్లో, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సంస్థను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇటీవల నిర్వహించిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మొదట యూనియన్ ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ప్రకటనను తమ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వంలో విలీనం తర్వాతే యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కార్మికులంతా కోరుతున్నారని తెలిపారు. కొంతమంది అవకాశవాదులు ప్రభుత్వం వద్ద ఒకవిధంగా, కార్మికుల దగ్గర మరోవిధంగా మాట్లాడుతున్నారని, ఈ విషయంలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం సీఎం రేవంత్రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని, తక్షణం విలీనం తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గోలి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ నాయకులు, డిపో అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆర్టీసీ సమ్మె సందర్భంగా మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ ఇచ్చిన హామీలను నెరవేర్చేక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో 12న బస్భవన్లో సమావేశం కానున్నట్టు జేఏసీ నేతలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాము చేపట్టిన సమ్మెను విరమించేందుకు ప్రభుత్వం పలు హామీలు ఇచ్చిందని జేఏసీ నేతలు చెప్పారు. వాటి అమలుకు సంబంధించి నిర్వహిస్తున్న సమావేశానికి జేఏసీలోని ఆయా సంఘాల నేతలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.