కలెక్టరేట్, ఫిబ్రవరి 26: పాలకులం కాదని.. ప్రజా సేవకులమని.. సామాన్యులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేయవచ్చని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కారు ఆచరణలో మాత్రం నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నది. నిన్న హనుమకొండ జిల్లా అగ్రహంపహాడ్ సమ్మక్క జాతరలో ‘జై తెలంగాణ’ అని నినదించిన పాపానికి యువకులపై లాఠీలు ఝుళిపించిన ఖాకీలు.. నేడు దళితబంధు రెండో విడత నిధులపై ఫ్రీజింగ్ ఎత్తివేయాలని సోమవారం కరీంనగర్ ప్రజావాణిలో విన్నవించేందుకు హుజూరాబాద్ నుంచి వచ్చిన 500 మంది లబ్ధిదారులపై దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఎక్కడివారినక్కడే అడ్డగించి బలవంతంగా పోలీసు వ్యాన్లు, జీపుల్లోకి నెట్టి, పోలీసు శిక్షణ కళాశాలకు తరలించారు. అర్జీలను గుంజుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి, వ్యాన్లలోకి ఎత్తిపడేశారు. పోలీసుల దమనకాండను నిరసిస్తూ పలువురు దళిత యువకులు కలెక్టరేట్ రోడ్డుపై మెరుపు ధర్నాకు దిగారు.
సీఎం రేవంత్ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వన్టౌన్ సీఐ సరిలాల్, పలువురు ఎస్సైలు, డిస్ట్రిక్ట్ గార్డులు యువకులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దళితబంధు రెండో విడత నిధుల నిలిపివేతపై కలెక్టర్ను కలిసేందుకు వెళ్తుంటే దుర్మార్గంగా వ్యవహరించడమేంటని ఆందోళనకారులు నిలదీశారు. మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఆందోళన విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున కార్యాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. దీంతో పదుల సంఖ్యలో ఆందోళనకారులు ఆయనపై విరుచుకుపడ్డారు. సమస్య జఠిలమవడానికి నువ్వే కారణమంటూ నిలదీశారు. దీంతో ఆయన ప్రజావాణికి తిరిగి వెళ్లిపోయారు. 10 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని చెప్పిన సంబంధిత అధికారి నెల గడిచినా విచారణ పూర్తి చేయలేదని లబ్ధిదారులు ఆరోపించారు. కరీంగనర్ జడ్పీ చైర్పర్సన్ కలెక్టరేట్ వద్దకు చేరుకొని లబ్ధిదారులకు సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు.
హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 26: సోమవారం దళితుల అరెస్ట్ను ఖండిస్తూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇక్కడ నల్లచొక్కా ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితబంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసేందుకు వెళ్లిన దళితులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. 2,800 మంది లబ్ధిదారులకు రూ.ఐదు లక్షల చొప్పున దళితబంధు నిధులను విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు లబ్ధిదారుల అకౌంట్లలో రూ.10 లక్షలు జమ చేశారని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో పెద్ద మంత్రిని అని చెప్పుకునే వ్యక్తి దళితులను అరెస్టు ఎందుకు చేయించారని, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. వెంటనే నిధులు ఇవ్వకపోతే ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
దళితబంధు రెండో విడుత పైసలు ఇయ్యాలని కలెక్టర్కు చెప్పుకునేందుకు వచ్చిన మమ్మల్ని పోలీసులు పట్టుకొని తన్నిన్రు. పోయిన నెలలో కలెక్టర్కు మా గోడు చెప్పుకుంటే 15 రోజుల్లో పరిష్కరిస్తా అని చెప్పింది. ప్రభుత్వం పట్టించుకోకుంటే ఇంకా ఎక్కువ లొల్లి చేస్తం.
– రామంచ వరలక్ష్మి, కనగర్తి, జమ్మికుంట మండలం, కరీంనగర్ జిల్లా
కూలీనాలీ చేసుకొని బతికే మమ్ములను లక్షాధికారులను చేసేందుకు కేసీఆర్ సార్ దళితబంధు పథకం పైసలు మొదటి విడత ఐదు లక్షలు ఇచ్చిండు. మిగిలిన పైసలు ఖాతాల్లో వేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేక నిధులను నిలిపివేసింది. కేసీఆర్ ప్రభుత్వమే మంచిగుండె.
– సమ్మక్క, ఇల్లందకుంట మండలకేంద్రం, కరీంనగర్ జిల్లా