హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: ప్రతి రంగంలో నిష్ణాతులైన వారిని ప్రోత్సహిస్తూ.. భావితరాలకు మన కళలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో గురువారం తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్పర్సన్గా దీపికారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంత్రి నిరంజన్రెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సాంస్కృతికశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ సమక్షంలో దీపికారెడ్డి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. వేలమంది విద్యార్థులను తయారు చేసి నృత్య కళకు జీవం పోసిన ఘనత ఆమె సొంతం అని కొనియాడారు. దీపికారెడ్డి మాట్లాడుతూ.. తనపై అపార నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. నాట్యం, నాటకం, సంగీత రంగాల్లో అనుభవజ్ఞులైన వారి సహకారం తీసుకుంటూ ముందుకెళ్తానని చెప్పారు. జిల్లాల్లోని యువతను కళల వైపు ప్రోత్సహించేలా కృషి చేస్తానని అన్నారు.