న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ తయారు చేసిన కార్బెవాక్స్ కొవిడ్-19 వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ 12-18 సంవత్సరాల పిల్లలకు వినియోగించనున్నారు. దేశంలో ఆర్బీడీ ప్రొటీన్ సాంకేతికపై తయారు చేసిన తొలి టీకా ఇదే.
కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వం 30కోట్ల డోసులను సేకరించనుండగా.. గతేడాది ఆగస్ట్ 2021లో ఆర్డర్ ఇచ్చింది. బయోలాజికల్ ఈ కంపెనీ కార్బెవ్యాక్స్ 250 మిలియన్ డోసులను ఉత్పత్తి చేసింది. రాబోయే కొద్ది వారాల్లో మిగతా మోతాదులను సైతం సిద్ధం చేయనున్నది. గతేడాది వ్యాక్సిన్ల కొనుగోలు కోసం బయోలాజికల్ ఈ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం రూ.1500కోట్లు అడ్వాన్స్గా చెల్లించిన విషయం విధితమే. ఇటీవల కార్బెవాక్స్ టీకా అత్యవసర వినియోగం కోసం బయోలాజికల్ ఈ డీసీజీఐకి దరఖాస్తు చేసింది. ఈ మేరకు నిపుణుల సమావేశమై టీకా అత్యవసర వినియోగానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. కార్బెవాక్స్ టీకా రూ.145 ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఇందులో పన్నులేవీ ఉండవని తెలుస్తున్నది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు అందుబాటులోకి వచ్చిన రెండో టీకా కాగా.. ఇంతకు ముందు కొవాగ్జిన్కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కార్బెవాక్స్ రెండు డోసుల టీకా కాగా.. మొదటి మోతాదు ఇచ్చిన 28 రోజుల తర్వాత రెండు డోసు ఇవ్వనున్నారు.