హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యానవర్సిటీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లో కూరగాయల సాగుపై అఖిలభారత సమన్వయ పరిశోధన పథకం సమావేశాలు నిర్వహించనున్నట్టు వర్సిటీ వైస్చాన్సలర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 20 నుంచి 22 వరకు మూడ్రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 300 మందికిపైగా శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొంటారని చెప్పారు. ప్రముఖ విత్తన సంస్థ నిపుణులు, భారత ప్రభుత్వ విత్తన ప్రతినిధులు కూడా హాజరుకానున్నట్టు వెల్లడించారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, వారణాసి, బెంగళూరు, ఢిల్లీలోని భారతీయ పరిశోధనల సంస్థల నుంచి పలువురు శాస్త్రవేత్తలు, నిపుణులు హాజరవుతారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పరీక్షించిన సూటి (దేశీయ) రకాలు, హైబ్రిడ్ రకాలు, విత్తన ఉత్పత్తిలో మేలైన పద్ధతులు, జనక (జన్యు) రకాల సేకరణ, పంటల ఆధునిక సాగు, చీడపీడలు, అతివృష్టి, అనావృష్టి తదితర వాటిపై చర్చించనున్నట్టు తెలిపారు. 22న ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో రైతుల ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలు చెబుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఏ భగవాన్, పరిశోధన సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, కూరగాయల పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ డీ అనితకుమారి, ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పీ ప్రశాంత్, డాక్టర్ ప్రీతంగౌడ్, ప్రొఫెసర్ సైదయ్య, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.