ఖమ్మం, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ముఖ్యమంత్రి మాత్రం విదేశాల్లో విహరిస్తున్నారని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితిలేదని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీపై ఈడీ కేసు పెట్టినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. రెండురోజుల ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఖమ్మం వచ్చిన కవిత.. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా, ఒక మంత్రి కూడా సమీక్ష చేయడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ జిల్లాకు చెందిన వారే అయినప్పటికీ కర్షకుల కష్టాలు, తడిసిన ధాన్యం గురించి ఆలోచించకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించుకోవడమే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రులు ములుగు పర్యటనకు వెళ్లినప్పుడు దవాఖానలో పసిపాప మృతిచెంది, తల్లిదండ్రులు ఆవేదనతో పాపను చూపిస్తున్నా మంత్రులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామంలో తన అభిమాని దేవరపల్లి పట్టాభిరామ్ గృహప్రవేశానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ఆ గ్రామం పొలిమేరల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కవిత అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గజమాల వేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆత్మీయంగా ప్రసంగించారు.
సీఎం ఇచ్చిన ఏ ఒక హామీ అమలు కావడంలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా చేశామంటూ ఘోరమైన అబద్ధాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. రైతు కూలీలకు ఇస్తామన్న ఆత్మీయ భరోసా ఏమైందని ప్రశ్నించారు. తాను ఖమ్మం రాగానే కాంగ్రెస్ నాయకుడొకరు తన బాధను వ్యక్తం చేస్తూ ఆ పార్టీ గ్రామ శాఖ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు కోసం కృషిచేసిన నాయకులు కూడా ఆత్మపరిశీలన చేసుకొని, ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని పేర్కొన్నారు. కమ్యూనిసుల్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో ఆయా పార్టీలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతున్నదని వ్యాఖ్యానించారు. ‘ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పెద్దలు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్లే ప్రశ్నించడం లేదా?’ అని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది నెలల్లోనే ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టును అప్పటి సీఎం కేసీఆర్ నిర్మించి, 60 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలవుతున్నా ఖమ్మం జిల్లాకు ఒక్క పథకం గానీ, ప్రాజెక్టు గానీ ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తాను ఇచ్చిన ప్రతీ మాట నెరవేర్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకం కోల్పోయిందని విమర్శించారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రతినిధులను ప్రజలు నిలదీయాలని కవిత పిలుపునిచ్చారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభతో తెలంగాణలో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. సభను విజయవంతం చేయాలని, ఖమ్మం జిల్లా నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. పర్యటనలో ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, మదన్లాల్, చంద్రావతి, బీఆర్ఎస్ నేతలు కోటేశ్వరరావు, రామ్మూర్తి పాల్గొన్నారు.