నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కూనంనేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికలో ధర్మయుద్ధం చేస్తున్నాని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నాడు. ధర్మం అనే పదం కోమటిరెడ్డి బ్రదర్స్ నోటి నుంచి వెంట వస్తే అదే ధర్మం సిగ్గుతో తల వంచుకుంటున్నది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్. కానీ బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా మారాడు. అన్నదమ్ములిద్దరికీ గుణపాఠం చెప్పాల్సిన కర్తవ్యం మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఉందన్నారు. కమ్యూనిస్టులు అమ్ముడు పోయారనడం సరికాదు. రాజగోపాల్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి. అదుపుతప్పితే నాలుక చీరేస్తాం. గుర్తు పెట్టుకో. మాకు అభిమానులు ఉన్నారు. మేం అమ్ముడుపోలేదు. మేం పార్టీ మారలేదు. నీచ సంస్కృతితో రూ. 18 వేల కోట్లకు అమ్ముడుపోయావు. రాజగోపాల్ రెడ్డికి ఆత్మే లేదు.. గౌరవం లేదు.. పనికిమాలిన మాటలు చెప్పడం సరికాదు.
గెలిపించిన ప్రజలను మోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి ప్రజలకు చేసిందేమిటి? అని ప్రశ్నించారు. దొంగ ప్రమాణాలు చేశావని తెలిస్తే నరసింహ్మస్వామి కూడా క్షమించడని బండి సంజయ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భవిష్యత్లో జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి పని చేస్తారు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు కలవొద్దా? హిందూ మతంపై భక్తి ఉంటే.. దొంగ పనులు ఎందుకు చేస్తున్నారు. స్వాములు, సన్నాసులు, మఠాధిపతులకు ఫామ్ హౌజ్ల్లో ఏం పని అని ప్రశ్నించారు. 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసింది బీజేపీ ప్రభుత్వం. కేంద్రంలో హోంశాఖకు అమిత్ షా లాంటి వ్యక్తి మంత్రి కావడం మన దురదృష్టమన్నారు. ఇక తెలంగాణ మీద పడ్డారు. కానీ తెలంగాణలో ఆ కుట్రలు ఫలించలేదు. తెలంగాణ గడ్డ మీద మీ ఆటలు సాగనివ్వం. ఈ గడ్డ మీద నుంచి బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పాలి. బీజేపీని తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోదీని తరిమికొట్టాల్సిన రోజులు వచ్చాయని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.