24 గంటల్లో 23 మంది మృతి
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం కరోనాతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా రికార్డుస్థాయిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,02,335 నమూనాలను పరీక్షించగా, కొత్తగా 5,567 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్టు గురువారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 989, రంగారెడ్డి జిల్లాలో 437, మేడ్చల్ మల్కాజిగిరిలో 421 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం ఇండ్లు, దవాఖానల్లో 49,781 మంది చికిత్స పొందుతున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రికవరీ రేటు తగ్గుతున్నది. రాష్ట్రంలో రికవరీ రేటు 86.85 శాతం నుంచి 86.16 శాతానికి, జాతీయ సగటు 85 శాతం నుంచి 84.5 శాతానికి తగ్గింది. రాష్ట్రంలో కరోనా టీకా తీసుకున్నవారి సంఖ్య 34 లక్షలకు చేరువైంది.