వృద్ధులు, దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం
యువతను వాహకంగా చేసుకుంటున్న వైరస్
తప్పు ఒకరుచేస్తే.. శిక్ష మరొకరికి
నిర్లక్ష్యం వీడాలంటున్న వైద్యారోగ్య నిపుణులు
హైదరాబాద్ తార్నాకకు చెందిన శ్రీనివాస్కు కరోనా భయం అస్సలు లేదు. మాస్క్ పెట్టుకోకుండా, భౌతికదూరం పాట్టించుకోకుండా తిరిగాడు. ఒక రోజు లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా, పాజిటివ్గా తేలింది. ఇదే సమయంలో శ్రీనివాస్ వల్ల ఇంట్లో ఉంటున్న తన తాత, అమ్మమ్మకు వైరస్ సోకింది. శ్రీనివాస్ వారంలో కోలుకున్నాడు.. కానీ, తాతయ్య, అమ్మమ్మ మాత్రం వైరస్తో పోరాడి ప్రాణాలు వదిలారు.
కరీంనగర్కు చెందిన యువ వ్యాపారికి కరోనా పాజిటివ్గా వచ్చింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా, మూడురోజులపాటు ఇంట్లోనే ఉండి సొంత చికిత్స చేసుకున్నాడు. ఇదే సమయంలో తన ద్వారా ఇంటి సమీపంలో ఉండే నలుగురు వృద్ధులు సహా 8 మందికి వైరస్ సోకింది. ఇందులో ముగ్గురు వృద్ధులు మృతి చెందగా, ఒకరు చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు.
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కరోనా పట్ల కొందరి నిర్లక్ష్యం సాటివారి ప్రాణాల మీదకు తెస్తున్నది. పాపం ఒకరిదైతే.. శిక్ష మరొకరికి పడుతున్నది. తప్పు ఒకరుచేస్తే.. శిక్ష మరొకరికి పడుతున్నది. తమకు వైరస్ సోకదనే అతి విశ్వాసం, వచ్చినా తమను ఏమీచేయదనే గుడ్డి నమ్మకం పూడ్చుకోలేనంత నష్టాన్ని కలిగిస్తున్నది. ఇంటి పెద్దలను దూరంచేస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,683 మంది కరోనా బారినపడి ప్రాణాలు వదలగా, ఇందులో అత్యధికులు వృద్ధులు, దీర్ఘకాలిక రోగులే ఉన్నారు.
పెద్దలకు సోకితే ప్రమాదమే..
వృద్ధులు, దీర్ఘకాలిక రోగులను వైరస్ లక్ష్యంగా చేసుకొని వ్యాపిస్తున్నది. సహజంగానే వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, ఇతర దీర్ఘకాలిక రోగాలు కలిగి ఉండటం వల్ల కరోనా వీరి ప్రాణాలను హరిస్తున్నది. దీనిని ముందే గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆయా వర్గాలను రక్షించేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు కేంద్రం 60 ఏండ్లు దాటిన వృద్ధులు, 45 ఏండ్లు దాటిన దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. మన దేశంతోపాటు ఇతర దేశాల్లో వృద్ధులను, దీర్ఘకాలిక రోగులను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ వర్గం వారు కొంతవరకు వైరస్ బారిన పడటంలేదు. కానీ, వీరిని యువత రూపంలో కరోనా చేరి ప్రాణాలను హరిస్తున్నదని వైద్య నిపుణులు చెప్తున్నారు.
యువత ద్వారా వృద్ధులకు..
విద్య, ఉద్యోగం, ఉపాధి ఇతర కారణాల నేపథ్యంలో యువత బయట అడుగుపెడుతున్నారు. ఆటోలు, బస్సులు, రైళ్లలో రాకపోకలు కొనసాగిస్తున్నారు. చాలామంది మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి ముఖ్యమైన విషయాలను పట్టించుకోవడం లేదు. దీంతో వైరస్ యువతకు సోకుతున్నది. యువతలో సహజంగానే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల వీరిలో లక్షణాలు కనిపించడం లేదు. జలుబు, జ్వరం వంటి సాధారణ లక్షణాలు కనిపించినప్పటికీ అది కరోనానే అని గుర్తించడం లేదు. చాలా మంది పరీక్షలు చేయించుకోవడం లేదు. ఈ క్రమంలో యువత నుంచి వైరస్ ఇంట్లో ఉండే పెద్ద వయసువారికి, దీర్ఘకాలిక రోగులకు వైరస్ సోకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ సమయంలోనే ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు వదులుతున్నారు. బాధ్యతగా ఉండాల్సిన యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీంతో తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరు అనుభవిస్తున్నట్టు స్పష్టంచేస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు 518
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్నది. కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గురువారం 57,548 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 518 మందికి పాజిటివ్గా తేలినట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 157 మంది వైరస్ బారినపడ్డారు.
యాదాద్రిలో ఆరుగురికి పాజిటివ్
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆరుగురికి కరోనా సోకినట్టు యాదగిరిగుట్ట పీహెచ్సీ వైద్యులు తెలిపారు. ఇందులో ముగ్గురు ఉద్యోగులు, ముగ్గురు అర్చకులు ఉన్నట్టు వారు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంతోపాటు వివిధ గ్రామాలకు చెందిన మరో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు.
ఒక్కరోజే 35 వేల మందికి టీకా
రెండోదశ వ్యాక్సినేషన్లో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 35,733 మంది తొలిడోస్ తీసుకున్నారు. 4,057 మంది రెండోడోస్ వేయించుకున్నారు. దీంతో ఇప్పటివరకు తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 8.54 లక్షలకు చేరగా, రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 2.30 లక్షలకు చేరింది.
ఏపీలో ఒక్కరోజే 984 మందికి కరోనా
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గురువారం 40,604 నమూనాలను పరీక్షించగా 984 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,96,863 చేరినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది.
రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు
అంశం గురువారం మొత్తం
పాజిటివ్ 518 3,05,309
డిశ్చార్జి 204 2,99,631
మరణాలు 3 1,683
యాక్టివ్ – 3,995