హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్, కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వారిని వైద్యులకు చూపించి, తగిన పరీక్షలు చేయించాలని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ముగ్గురు విద్యార్థులు కొవిడ్ బారిన పడడంతో వారికి సమగ్ర వైద్యం అందించాలని, ఆదేశించారు.
ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో 8వ తేదీలోపు 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను, వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆయా గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది బాధ్యత తీసుకుని ప్రతి విద్యార్థి టీకా వేయించుకునేలా చూడాలన్నారు. గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ అదనపు కార్యదర్శి నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసులకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం ఆయనకు వీడ్కోలుపలికి, శాలువాతో సన్మానించారు.