జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్లో కోటి రూపాయలతో ప్రభుత్వం తరఫున వృద్ధాశ్రమాన్ని నిర్మించనున్నట్లు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సోమవారం టి.ఆర్. నగర్లో ఎకరం 25 గుంటల భూమిలో అన్ని వసతులతో కూడిన వృద్ధాశ్రమ భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.
భవన నిర్మాణ పనులకు 50 లక్షలరూపాయలను మొదటి విడతగా మంజూరు అయ్యాయని, భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకునే విధంగా నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను రెడ్ క్రాస్ సోసైగా వారికి అప్పగిస్తామని, ఎన్జీవోల ద్వారా ఆశ్రమ నిర్వహణ బాగుంటుందని, సేవా దృక్పథంతో ప్రారంభించిన అశ్రమంలో ఎవరైన వారికి సేవలను అందించవచ్చని మంత్రి తెలిపారు.
అనంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. అలాగే పద్మనాయక కళ్యాణ మండపంలో ఆపదలో ఉన్న పిల్లలకు సేవలను అందించడానికి ఏర్పాటు చేసిన (1098) బాలరక్షక వాహనాన్ని ప్రారభించారు.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, జిల్లా కలెక్టర్ జి.రవి, మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ ఏ.శ్రీకాంత్ రెడ్డి, డి.డబ్ల్యూ.ఓ. నరేష్, తదితరులు పాల్గొన్నారు.