జగిత్యాల, ఫిబ్రవరి 29: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ఇంజినీర్ను ఉరితీయాలని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కేటీఆర్ మేడిగడ్డ సందర్శనకు వెళ్తుండటంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు నెర్రెలు బారినప్పుడే కేటీఆర్ మేడిగడ్డను సందర్శిస్తే బాగుండేదని సూచించారు.
ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా డిజైన్ చేయడం, నిర్వహణ లోపం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా తయారైందని, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారి ఎవరో వాడిని ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రశ్నించడంపై జీవన్రెడ్డి స్పందించారు. సర్పంచ్ ఎన్నికలు మే లేదా జూన్ నెలలో తమ ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలోనే సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేశాం తప్ప.. వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గిరి నాగభూషణం, విజయలక్ష్మి, బండ శంకర్, దుర్గయ్య, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.