హైదరాబాద్ : ఇటీవల జరిగిన శాసన మండలి( Council ) సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం (Congress Governments Failure ) , డొల్లతనం బట్టబయలైందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి ( Madhusudhana Chary) ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శాసన సభ, మండలి సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.
సభను నడిపే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, పోలీసుల మోహరింపు, లైవ్ కవరేజీలో వివక్ష చూస్తుంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తామిచ్చిన 20 అంశాలను, వాయిదా తీర్మానాలను పక్కనపెట్టి, కేవలం బిల్లుల ఆమోదానికే ప్రాధాన్యత ఇస్తూ చర్చకు భయపడ్డారని పేర్కొన్నారు. చర్చలకు, పరిష్కరాలకు వేదికగా నిలబడాల్సిన కౌన్సిల్ ఆరు రోజులు కుట్రలకు వేదికలాగా అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాన ప్రతిపక్షాలకు ఇబ్బంది పెట్టడానికి, పాలకపక్షానికి ఇష్టారీతిన వ్యవహరించడానికి కారణమైందని దుయ్యబట్టారు. పలు ప్రధాన అంశాలపై సభా వాయిదా తీర్మాణాలు బాధ్యతగా ప్రవేశపెట్టగా ఏ ఒక్క అంశం మీద ప్రభుత్వం చర్చకు ముందుకు రాలేదని, ప్రజా సమస్యలు చర్చించడానికి నైతిక స్థైర్యం లేక చర్చకు అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ కుట్రను , బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే సమావేశాల్లోనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.