హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సహకార సంఘాలు బలోపేతం అయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ గృహకల్పలో తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం డైరీ, క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి రాకతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో సహకార శాఖ ప్రాధాన్యం పెరిగిందని అన్నారు.నీటి వృధాను అరికట్టడం, సాగు చేయాల్సిన పంటల రకాల మీద రైతులను చైతన్యం చేసే బాధ్యత సహకార శాఖ అందిపుచ్చుకోవాలని సూచించారు.
ప్రతి రంగంలో మనుషుల మధ్య సంబంధాలను పెంచేందుకు సహకార శాఖ కృషిచేయాలన్నారు.సహకార సంఘాలు బలోపేతం కాకుంటే కార్పోరేట్ వ్యవస్థ వేళ్లూనుకుంటుందని పేర్కొన్నారు. పెరుగుతున్న సంపద దుర్వినియోగం కాకుండా కాపాడాలని, దాని వల్ల సమాజానికి నష్టం వాటిళ్లుతుందని స్పష్టం చేశారు. గతంలో సహకార సంఘాలలో ఉద్యోగాల జీతాలకు ఇబ్బందులుండేవని తెలిపారు.
సహకార ఉద్యోగులు వివిధ స్థాయిల వారు కేరళలోని సహకార సంఘాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర సహకార ఉద్యోగుల సంఘం నేత నర్సింహారెడ్డి, సంఘం అధ్యక్షులు జగన్ మోహన్ రావు, అడిషనల్ రిజిస్ట్రార్లు సుమిత్ర, శ్రీనివాసరావు, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.