హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గడ్డం సాయన్న పేదల పక్షపాతి అని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండేవారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సాయన్న ఔన్నత్యం గల మనిషి అని గుర్తుచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి.. తొలుత సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సాయన్నతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉన్నదని, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటినుంచే తమ మధ్య స్నేహం ఉన్నదని గుర్తు చేసుకొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అంశాలపై కలిసి చర్చించుకొన్నామని తెలిపారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. సాయన్న కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సాయన్న మృతికి సంతాప సూచకంగా సమావేశంలో నిమిషంపాటు మౌనం పాటించారు.