హైదరాబాద్ డ్రగ్స్ వాడకం తెలంగాణలో ఇంకా ప్రమాద స్థాయికి చేరుకోలేదని, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని మొగ్గలోనే తుంచేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ అధికారుల సదస్సు జరిగింది.
ఈసందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. డ్రగ్స్ను నియంత్రించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు. మొదటి వ్యూహంలో ఇప్పటికే డ్రగ్స్ అడిక్ట్ అయిన వారిని గుర్తించి, వారిని వారి కుటుంబ సభ్యులు సహకారం తీసుకొని డీ అడిక్ట్ చేయడం కోసం తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ వినియోగానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తించడం వారికి అందుతున్న డ్రగ్ నెట్వర్క్ లింక్ను గుర్తించి నిర్మూలించడం అనేది రెండో ముఖ్యమైన కార్యాచరణగా చేపట్టాలని సీఎం తెలిపారు.
డ్రగ్స్ మాఫియాను గుర్తించి, అరికట్టే క్రమంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధునాతన ఆయుధాలను వినియోగించాలి. నిష్ణాతులైన మెరికల్లాంటి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్ మాఫియాపై విజృంభించాలి. స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు అవలంబిస్తున్న విధానాలను పరిశీలించి డ్రగ్స్ నేరస్తులను గుర్తించి పట్టుకునే దిశగా తెలంగాణ పోలీసు అధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అన్నారు.
స్కాట్ లాండ్ యార్డ్ మాదిరిగా డ్రగ్ కంట్రోల్ చేస్తున్న దేశాల్లో అవసరమైతే పర్యటించి రావాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ చేస్తున్న అధికారులను పిలిపించి వారితో శిక్షణ తీసుకోవాలన్నారు. ఎంత ఖర్చయినా పర్వాలేదని, తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుందని సీఎం పునరుద్ఘాటించారు.
గంజాయి తదితర డ్రగ్స్ వ్యాపారం, పంపిణీ, వినియోగం చేస్తున్న వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలను పట్టాలని, డ్రగ్స్ కంట్రోల్ విషయాలలో తెలంగాణ పోలీస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సీఎం అన్నారు. అభివృద్ధితో ప్రగతి ప్రస్థానం సాగిస్తున్న తెలంగాణలో గంజాయి, కొకైన్, ఎల్సీడి వంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే వున్నదని, మొగ్గలోనే తుంచి వేయకపోతే, డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరితే మనకు అర్థం కాకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ వినియోగం వైపు ఎక్కువగా యువత ఆకర్షితులవుతున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని, ధనవంతులు పేదలు అనే బేధం లేకుండా అన్ని తరగతుల కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తమ పిల్లల అలవాట్లపై దృష్టి సారించాలని సీఎం కోరారు. డ్రగ్స్ వాడకం అత్యంత ప్రమాదకరమని, దానిని కూకటివేళ్లతో నాశనం చేయకుంటే మనం సంపాదించే ఆస్తులకు, సంపాదనకు అభివృద్ధికి అర్థం లేకుండా పోతుందని సీఎం స్పష్టం చేశారు.
“ఎంత ధనం ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం మన పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్కు బానిసలై వాళ్ల భవిష్యత్ మన కండ్ల ముందే నాశనమైపోతుంటే ఎంత వేదన…” అంటూ సీఎం, యువత తల్లిదండ్రులను హెచ్చరించారు.
డ్రగ్స్ కంట్రోల్ లో సభ్యసమాజం సహకారం తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం సూచించారు. అందుకు గ్రామ సర్పంచులు, టీచర్లు, లెక్చరర్స్, విద్యార్థులతో సమావేశాలు సజావుగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం సూచించారు. ఈ దిశగా స్ధానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా చైతన్యపరచాలని సీఎం అన్నారు.
గ్రామంలో ఏ రైతు గంజాయి సాగు చేస్తున్నట్టు రుజువైనా ఆ సమాచారం అందించకపోతే ఆ గ్రామానికి రైతు బంధు తదితర సబ్సిడీలు రద్దు చేస్తామని ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల పట్ల గ్రామస్తులంతా అప్రమత్తమై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.
ఇది అధికారుల ఆదేశాలతోనో, ఉద్యోగమనో కాకుండా బాధ్యతతో మనసు మీదికి తీసుకుని డ్రగ్స్ కంట్రోల్ విషయంలో కృషి చేయాలని సీఎం స్పష్టం చేశారు. అనుభవం ఉన్న ప్రతి అధికారిని డ్రగ్ కంట్రోల్ అంశంలో వినియోగించుకోవాలన్నారు.
వ్యవస్థీకృత నేరాలను కంట్రోల్ చేస్తున్న విధంగా పీడీ యాక్ట్లు కూడా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మీరు ఏం చేస్తారో ఏమో ప్రభుత్వం మీకు పూర్తి సహకారం అందిస్తుంది.. మీరు రాష్ట్రంలో డ్రగ్స్ వాడకంలో వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి చేపట్టాల్సిన అన్నిరకాల చర్యలు చేపట్టాలని సీఎం డీజీపీని ఆదేశించారు.
నేరస్తులను పట్టుకొని విచారించే క్రమంలో కీలకమైన ‘ఫోరెన్సిక్ ల్యాబ్స్’ ను మరిన్నిటిని అత్యంత అధునాతన సాంకేతికతో ఏర్పాటు చేయాలన్నారు. న్యాయస్థానాల ముందు డ్రగ్స్ నేరస్థులను ప్రవేశపెట్టినప్పుడు కేసులు వీగిపోకుండా, నేరాలను రుజువు చేసేందుకు కావాల్సిన అన్నిరకాల ప్రాసిక్యూషన్ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.
డ్రగ్స్ కేసుల్లో బెయిల్ త్వరగా వచ్చే పరిస్థితులున్నందున వ్యసనపరులు, వ్యాపారులు తిరిగి మళ్లీ మళ్లీ కొనసాగిస్తున్నారని, వీటిపై తగిన దృష్టిని సారించాలని, అందుకు సంబంధించిన న్యాయ సలహాలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న అధికారులకు సీఎం సూచించారు.
కోర్టుల్లో పోలీస్ అధికారులు నేరాలను నిరూపించేందుకు చేపట్టవలసిన చర్యలు, సమకూర్చవలసిన వసతులను ఏర్పాటు చేయాలని, ఇందుకు తగు చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం ఆదేశించారు. సినిమా, సోషల్ మీడియా, తదితర సాంస్కృతిక వేదికలు ఆన్లైన్ వేదికల మూలాన కూడా డ్రగ్స్ వాడకం పెరిగిపోతున్నదని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “డ్రగ్స్ ను నియంత్రించే దిశగా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రజా సంబంధాల వ్యవస్థలను మెరుగుపరచాలని, మీడియా, సినిమా మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవాలని, డ్రగ్స్ నియంత్రించే దిశగా నిర్మించే సినిమాలు, డాక్యుమెంటరీలు, అడ్వర్టైజ్మెంట్లకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చి నేరాలకు పాల్పడుతున్న వ్యవస్థీకృత నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీని సీఎం ఆదేశించారు. వారిని నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఆయా దేశాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న విదేశీయులను గుర్తించి వెంటనే వారి వారి దేశాలకు పంపించాలన్నారు. అందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గంజాయి తదితర నార్కొటిక్ డ్రగ్స్ వినియోగం, వాటి మూలాలను గుర్తించి కఠినంగా నియంత్రించాలని సంబంధిత పోలీస్ కమిషనర్లకు సీఎం స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి, సరిహద్దుల్లోంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి తదితర మాదక ద్రవ్యాల నెట్ వర్క్ ను గుర్తించి కఠినంగా నిర్మూలించాలన్నారు.
డ్రగ్స్ అక్రమ రవాణా నెట్ వర్క్ను దాని సాంద్రతను లోతుగా అధ్యయనం చేసి నియంత్రణ కార్యాచరణ అమలుచేయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రించే విషయంలో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల నడుమ సమన్వయం సాధించాలన్నారు. అన్ని రకాల డ్రగ్ కంట్రోల్ విభాగాలను బలోపేతం చేయాలన్నారు.
మూసివేసిన పరిశ్రమలు తదితర ఫ్యాక్టరీలు డ్రగ్స్ తయారీ పంపిణీ కేంద్రాలకు నెలవులుగా మారుతున్నాయని అధికారులు చేసిన సూచన పట్ల సీఎం ఘాటుగా స్పందించారు. తక్షణమే అటువంటి ‘క్లోజ్డ్ ఇండస్ట్రీ’లను గుర్తించి రూపుమాపాలని సీఎం స్పష్టం చేశారు.