హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుషలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. అనతికాలంలోనే అన్ని రంగాలను పటిష్ట పరుచుకున్నామని, ‘శుభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించనున్నదని సీఎం అన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని తెలిపారు. దేశంలో రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించేలా కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించిందని సీఎం అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని తెలిపారు. వ్యవసాయం బాగుంటేనే సర్వజనులు సంతోషంగా ఉంటారనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నదని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ వ్యవసాయ రంగం దేశ జీడీపీకి దోహదపడటంలో ముందున్నదని తెలిపారు. తెలంగాణ ఉత్పత్తి సేవా రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంలో.. వ్యవసాయ రంగం పరోక్ష పాత్రను పోషిస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు.
శుభకృత్ నామ సంవత్సరాదిని పురస్కరించుకొని ప్రగతి భవన్లో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటారు. రాష్ట్ర దేవాదాయ, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలను రూపొందించారు. ధర్మపురికి చెందిన ప్రముఖ పండితుడు, ప్రవచనకారుడు బాచంపల్లి సంతోష్ ఉగాది పంచాంగ పఠన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, పలువురు వేద పండితులను, జ్యోతిష్య, అర్చక పండితులను ముఖ్యమంత్రి స్వయంగా సన్మానించనున్నారు. పండితులతో వేద ఆశీర్వచన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.