ఆర్టీసీని ఎలాగైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్ధ అభివృద్ధికి చాలా మార్గాలను పరిశీలిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఆర్టీసీని ఆర్ధికంగా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో 2017-18 బడ్జెట్లో ఆర్టీసీకి ప్రభుత్వం రూ.994 కోట్లు కేటాయించింది. సబ్సిడీల కోసమే రూ.520 కోట్లు కేటాయించింది. 2016-17 కేటాయింపులతో పోల్చితే 2017-18 బడ్జెట్లో రూ.511.17 కోట్లు అదనంగా కేటాయించారు. అలాగే, 2018-19 బడ్జెట్లో రూ.975.55 కోట్లు, 2019-20 బడ్జెట్లో రూ.630 కోట్లు, 2020-21లో రూ.1,000 కోట్లు కేటాయించారు. రూ.350 కోట్లతో కొత్తగా 1350 బస్సులు కొనుగోలు చేశారు. 2017 మే 4న 60 మినీ ఏసీ బస్సులు (వజ్ర), 50 మినీ బస్సులు (పల్లె వెలుగు) మరియు వంద శాతం బయోడీజిల్ తో నడిచే రెండు బస్సులను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మరో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.
మొదట 20 బస్సులను జేఎన్టియు నుంచి శంషాబాద్ వరకు, ఆ తరువాత సికింద్రాబాద్ నుంచి ఎయిర్ పోర్ట్ వకరు మరో 20 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ద్వారా వచ్చే ఫలితాలు, డిమాండ్ నేపథ్యంలో రెండో విడుతలో మరో 50 బస్సులను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం బావిస్తుంది. ఈ మేరకు గోల్డ్స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీతో ఆర్టీసీ ఒప్పందం చేసుకున్నది. మొత్తంగా అన్ని రకాల బస్సులు కలుపుకొని 2013-14 లో 10,406 బస్సులు నడువగా, 2019-20 లో 9,691 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో జిల్లాల్లో 2015-16తో పోలిస్తే 2016-17 లో రూ.233 కోట్ల నష్టం తగ్గింది. మొత్తంగా 60 కోట్ల నష్టం తగ్గింది.
ఇందనం పొదుపులో వరుసగా రెండో సారి దేశంలోనే స్థానాన్ని సంపాదించుకుంది టీఎస్ఆర్టీసీ. ప్రతీ లీటరుకు 5.45 కి.మీ. మైలేజి సాదిస్తున్నది. మరే ప్రభుత్వ రంగ సంస్థ ఇవ్వని విధంగా.. ఆర్టీసీ సంస్థ ఏటా ఉద్యోగుల జీతాల కోసం 52శాతం ఆదాయాన్ని అంటే సుమారుగా రూ.2400 కోట్లు ఖర్చు చేస్తున్నది. దీంతో సంస్థకు ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతున్నందున ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు వల్ల పడిన ఆర్ధిక భారం రూ.750 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. 2013-14 లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.121.95 కోట్ల సబ్సిడీ ఇవ్వగా, 2019-20 లో టిఆర్ఎస్ ప్రభుత్వం రూ.460 కోట్ల ఇచ్చింది. టీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 98 లక్షల మందిని గమ్యానికి చేరుస్తుంది. సుమారుగా 10,500 బస్సులు నడుస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ లో : హైదరాబాద్ లో ఈ సంస్థ రూ.218 కోట్ల నష్టంలో ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా అర్బన్ ట్రాన్స్ పోర్ట్ నష్టాల్లోనే ఉంటుందని, ఈ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ను అక్కడి ప్రభుత్వాలే నిర్వహిస్తుంటాయని గుర్తించిన ప్రభుత్వం మన రాష్ట్రంలోనూ అలాంటి విధానాన్నే అవలంభించాలని 2015 సెప్టెంబర్ 2న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. దీంతో ఇక టీఎస్ఆర్టీసీ నష్టాలను జీహెచ్ఎంసీ భరించనుంది. హైదరాబాద్ లో 3800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. వాటి నష్టాలను జీహెచ్ఎంసీ నిధుల నుంచి పూడ్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆర్టీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టరుగా నియమిస్తూ చట్ట సవరణ చేశారు. రూరల్ ఏరియాలో వచ్చే ఆదాయంలో అప్పులు కట్టనున్నారు. బస్టాండ్ల నిర్వహణ తదితర అంశాలపై కమిషనరే నిర్ణయం తీసుకుంటారు. టీఎస్ఆర్టీసీకి జీహెచ్ఎంసీ నుంచి రూ.336 కోట్లు ఇప్పించారు.
బస్సుల్లో జీపీఎస్, ప్యానిక్ బటన్ ను తప్పనిసరి చేశారు. ప్రమాదాల నివారణకు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 9691 బస్సుల్లో మొత్తం రోజుకు 98 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణం చేస్తున్నారు. సుమారుగా రోజుకు రూ.12 కోట్ల కలెక్షన్ వస్తుంది. ఇంత మంది ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట పైటెట్ ప్రాజెక్టుగా 400 బస్సులకు జీపీఎస్ పరికరాలను అమర్చి హైదరాబాద్-కరీంనగర్ మార్గంలో అమలు చేస్తున్నారు.
1.ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్
తెలంగాణ ఆర్టీసీ సంస్థను నడిపించడానికి యాజమాన్యం ఒక దశలో ఉద్యోగుల సహకార సంఘం డబ్బులను కూడా వినియోగించుకోవలసి వచ్చింది. అందుకే ప్రభుత్వం స్పందించి ఆర్టిసిని ఆదుకుంది. ఆర్టీసీ ఏడాదికి 49,115 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి రూ. 2858.77 కోట్లు ఖర్చు చేస్తున్నది.2013-14లో రూ.1,622.33 కోట్లు ఖర్చు చేసేవారు. కేవలం జీతభత్యాల మీదనే ఆర్టీసీ సంస్థ తన ఆదాయంలో 52 శాతం పైగా ఖర్చు పెడుతున్నది. 2013-14 లో ఆర్టీసీ ఉద్యోగుల సగటు వేతనం రూ.23,293 ఉండగా, 2019-20 లో అది రూ.48,504 కు చేరింది. 2013-14 లో ఉద్యోగుల వేతనాల కోసం రూ.1,622.33 కోట్లు ఖర్చు చేయగా, 2019-20 నాటికి వీరి జీతాల కోసం రూ.2,858.77 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరే ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇంత పెద్ద మొత్తంలో జీతాల మీద ఖర్చు పెట్టడంలేదు. ఆర్టిసి సిబ్బందికి 44శాతం ఫిట్ మెంట్ పెంచుతూ ప్రభుత్వం 2015 మే 13న నిర్ణయం తీసుకుంది. 2015 జూన్ నుంచి దీనిని అమలు చేసింది. సమ్మె సమయంలో పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది. ఏపీలో 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తే, తెలంగాణలోని 55 వేల మంది ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు రూ.750 కోట్లని విడుదల చేసి వారి బారాన్ని తగ్గించింది. సుమారు 4,200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారు. రిటైర్డ్ కార్మికులకు ఉచిత బస్ సదుపాయం కల్పించింది.
2.ఉద్యోగులకు 16 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి)
2018 జూన్ 11న ఆర్టీసీ ఉద్యోగులకు 16శాతం ఐఆర్ (మధ్యంతర భృతి)ని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీ సంస్థ బలోపేతానికి హైలెవల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
3.ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్
తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపచేస్తున్నట్లు 2015 ఏప్రిల్ 25న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా ఆర్టీసీలో పనిచేస్తున్న 58,770 మంది కార్మికులకు ప్రయోజనం కలిగింది.ఈ ఇంక్రిమెంట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.20 కోట్ల అదనపు భారం పడింది.
4.పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు
ఆర్టీసీ లో పనిచేస్తున్న సంస్థ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 సంవత్సరాలనుండి 60 సంవత్సరాలకు పెంచారు.
5.ఆర్టీసీ సమ్మెకాలపు జీతాలు చెల్లింపు
ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం 2019 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 28 ( 55 రోజులు) వరకు సమ్మె చేసారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమణ చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి వారికి సమ్మెకాలపు జీతాలను చెల్లిస్తానని వారికి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్ ) గా పరిగణిస్తూ 12 మార్చి, 2020న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి జీతాలకై ప్రభుత్వం రూ.235 కోట్లను విడుదల చేసింది. ఈ జీతాలను 13 మార్చి, 2020 న కార్మికుల ఖాతాల్లో జమ చేశారు.
6.ఆర్టీసీ కార్మికులు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే సాయం పెంపు
ఆర్టీసీ ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుండి రూ.20 వేలకు పెంచారు. ఈ ఉత్తర్వులను 2017 జనవరి 20న విడుదల చేశారు.
ప్రశంసించిన కేంద్రమంత్రి
తెలంగాణలో వినూత్నంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రత్యేకంగా ప్రశంసించారు. జూన్ 24న ఈ బస్సుల ఫొటోలను జతచేస్తూ షెకావత్ ట్వీట్ చేశా రు. ‘షీ టాయ్లెట్స్ అనేది గొప్ప ఆలోచన’ అని కొనియాడారు.
ఆర్టీసీలో దాదాపు 600 వరకు కాలంచెల్లిన బస్సులున్నాయి. వీటిలో 150-200 వరకు కార్గో సేవలకు వినియోగించేందుకు నిర్ణయించారు. మిగిలిన వాటిల్లో బస్సు కండిషన్ను బట్టి రూ.ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు విక్రయించేందుకు ఆర్టీసీ సిద్ధమయింది. బస్సును కొనుగోలు చేశాక దానిని బయోటాయిలెట్గా మార్చేందుకు మరికొంత వ్యయం అవుతుంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇటీవల అందుబాటులో కి తెచ్చిన వాహనానికి రూ.5,66,600 వరకు వ్యయం అయినట్టు తెలిసింది. వాహనంలో పబ్లిక్ టాయిలెట్తోపాటు మోడ్రన్ వాష్రూం కూడా ఏర్పాటుచేశారు.
7.ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ‘‘సంక్షేమ బోర్డు’’
ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను, సూచనలను నేరుగా పైఅధికారులకు తెలియజేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ బోర్డుకు శ్రీకారం చుట్టారు. ప్రతిడిపో నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 202 మంది ఉద్యోగులతో యాజమాన్యం సంక్షేమబోర్డును ఏర్పాటు చేసింది. సమస్యలు, సూచనల కోసం ప్రతి డిపోవద్ద ఈ-బాక్సులను ఏర్పాటుచేసి.. రోజూ సాయంత్రం వాటిని తెరుస్తున్న అధికారులు.. సమస్యలను విభజించి పరిష్కారం చూపుతున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంక్షేమబోర్డు ప్రతి మంగళవారం సమావేశం అవుతుంది.
గతంలో తమకు ఎదురవుతున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలంలే కార్మికులు బయపడేవారు. వారు అనేక ఇబ్బందు లు ఎదుర్కునేవారు. యూనియన్ నేతల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నిస్తే అది మరో సమస్యకు దారితీసేది. ఇలాంటి సమస్యలేవీ లేకుండా.. కార్మికుడు, ఉన్నతాధికారులకు మధ్య ఉన్న దూరం పూర్తి గా తగ్గేలా ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటుచేసింది. డిపోల్లో వస్తున్న ఫిర్యాదులు, వినతులను రోజూ ఆన్లైన్లో అప్డేట్ చేస్తుండటంతో.. బస్భవన్ నుంచి ఉన్నతాధికారులు సైతం పరిశీలించేందుకు వీలు కలుగుతున్నది.
ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు
హోదా | ఉద్యోగుల సంఖ్య |
అధికారులు | 293 |
సూపర్ వైజర్లు | 987 |
డ్రైవర్లు | 18,432 |
కండక్టర్లు | 20,217 |
గ్యారేజీ స్టాఫ్ | 5,745 |
ఇతర ఉద్యోగులు | 4,059 |
మొత్తం ఉద్యోగులు | 49,733 |
ప్రయాణికులను మాత్రమే చేరవేసే ఆర్టీసీ ఇటీవలే కార్గో పార్సిల్ సర్వీసులు ప్రారంభించింది. తాజాగా డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తొలుత హైదరాబాద్, వరంగల్ నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కూల్స్ లో 40 రోజుల శిక్షణనిస్తారు. ఇందులో 10 రోజులు థియరీ క్లాసులు, మిగతా 30 రోజులు ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేయనున్నారు.
అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్ ఆన్ వీల్స్ ఏర్పాటు
బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) పట్టణాల సాధనలో భాగంగా ప్రతి వెయ్యి జనాభాకు ఒకటి చొప్పున పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ‘స్త్రీ టాయిలెట్ల’ను ఆదర్శంగా తీసుకొని.. అవసరమైన అన్నిచోట్లా ‘టాయిలెట్ ఆన్ వీల్స్’ ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీలో కాలంచెల్లిన బస్సులను తీసుకొని వాటిని స్త్రీ టాయిలెట్స్ గా మారుస్తారు. వీటిని రద్దీ మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు, పార్కులు, ప్రార్థనా మందిరాలు, భారీ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలు, వారాంతపు అంగళ్లు (సంతలు) జరిగే చోట్లకు తరలిస్తారు.
ఈ టాయిలెట్లలో ఇండియన్, వెస్టన్ కమోడ్ ల్యాట్రిన్లు, బయో టాయిలెట్, శానిటరీ ప్యాడ్ డిస్పెన్సర్, వాష్ బేసిన్, అద్దం, కియోస్క్, చంటి బిడ్డలకు తల్లులు పాలిచ్చేందుకు ప్రత్యేక స్థలం, దివ్యాంగులకు అనుకూలంగా ర్యాంపు, లోపలి సౌకర్యాలు ఉంటాయి. ఇందులో శుభ్రమైన నీరు, హ్యాండ్ వాష్, శానిటైజర్, శానిటరీ ప్యాడ్లు, మాస్కులు అమ్మే చిన్న దుకాణం ఉంటాయి. వీటిని మహిళా సంఘాలకు గానీ, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకుగానీ అప్పగిస్తారు.
ప్రైవేటు సంస్థలకన్నా తక్కువ ధరల్లో ఆర్టీసీ కార్గో
అసలే నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి కరోనా వైరస్ ఉదృతి కారణంగా మరింత నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఈ నష్టాల నుంచి బయట పడటానికి ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషించి.. ఆర్టీసీ పార్సిల్, కొరియర్, కార్గో సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. నగరంలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం 19 జూన్, 2020 న ప్రారంభించింది. అన్ని బస్స్టేషన్లలో కార్గో సేవలు అందుబాటులో ఉంచారు.
ప్రైవేటు రేట్లతో పోలిస్తే ఆర్టీసీ పీసీసీ సేవల చార్జీలు తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల వరకు కూడా ఈ సేవలు అందుతున్నాయి. 160 నుంచి 170 కార్గో బస్సులను వివిధ ప్రభుత్వ శాఖల వస్తు రవాణాకు వినియోగిస్తున్నారు.
గతంలో ఆర్టీసీ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పార్సిల్- కొరియర్ సేవలను నిర్వహించేది. తద్వారా సంస్థకు నెలకు రూ.70 లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ ఆర్టీసీ సొంతంగా పార్సిల్- కొరియర్ సేవలు ప్రారంభించిన తర్వాత తొలిరోజు రూ.15 వేలతో మొదలైన ఆదాయం రోజుకు రూ.8 లక్షలకు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 147 బస్స్టేషన్లలో పార్సిల్- కొరియర్ సేవలు అందుతున్నాయి. ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అవసరమైన వస్తు రవాణా కూడా ఆర్టీసీ చేస్తున్నది. ఇంటి సామాను తరలించేందుకు కూడా ఈ బస్సులను ఉపయోగిస్తున్నారు.
పార్సిల్ సర్వీసులతో రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు వెళ్లే అన్ని ప్రాంతాలకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు తమ ఇంటికి దగ్గరలోని ఆర్టీసీ పార్సిల్ ఏజెంట్లు, బస్సు స్టేషన్లు, స్టాపుల వద్దకు వెళ్లి స్టాళ్లలో పార్సిల్ అందజేసి, ఇందుకయ్యే ఖర్చును చెల్లిస్తే, 24 గంటల్లో గమ్యానికి చేరేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
రిటైల్ ఇంధన అమ్మకాల్లోకి ఆర్టీసీ (7.8.2020)
ఆదాయ సముపార్జనలో భాగంగా టీఎస్ ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసింది. ఆదాయ పెంపులో భాగంగా టీఎస్ ఆర్టీసీ, హెచ్పీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఔట్లెట్లలను నిర్వహించేందుకు నిర్ణయించింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో జనగామలో ఏర్పాటు చేసిన పెట్రోల్బంకును రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. హన్మకొండ, మహబూబాబాద్, బిచ్కుంద, బీర్కూర్, ఆసిఫాబాద్లలో కూడా ఇంధన అవుట్లెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఔట్ లెట్లలో రిటైల్ ఇంధన అమ్మకాలతో ఆర్టీసీకి నెలకు రూ. 20.65 లక్షల అదనపు ఆదాయం సమకూరుతున్నది.
హెచ్పీసీఎల్, ఐవోసీఎల్తో కలిసి పెట్రోల్పంప్ అవుట్లెట్లను నిర్వహించేందుకు టీఎస్ఆర్టీసీ ఎంవోయూ చేసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్, కరీంనగర్జోన్లలో కలిపి మొత్తం 92 పెట్రోల్ బంకుల నిర్వహణ కోసం ఓపెన్ టెండర్ల ద్వారా సర్వీసు ప్రొవైడర్లను నియమించింది. అవుట్లెట్లన్నీ ప్రారంభమయ్యాక నెలకు రూ.83.58 లక్షల ఆదాయం వస్తుందని అంచనా.
ఇంధన పొదుపులో ఆర్టీసీకి జాతీయస్థాయి అవార్డు దక్కింది. 4001 కన్నా ఎక్కువ బస్సులున్న సంస్థల క్యాటగిరీలో అత్యధిక కేఎంపీఎల్ సాధించినందుకు కేంద్ర పెట్రోలియంశాఖ కార్యదర్శి తరుణ్కపూర్ నుంచి ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ 16 జనవరి 2021న వర్చువల్గా అవార్డు అందుకున్నారు. రూ.3 లక్షల నగదు పురస్కారాన్ని కేంద్రం అందించింది.
ఆర్టీసీలో విధి నిర్వహణ సందర్భంగా అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తున్నదంటున్న ఉద్యోగుల ఆవేదనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పందించారు. ఆర్టీసీలో ఉద్యోగాలకు భద్రత కల్పించాలన్న సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించగా, ఈ మేరకు 5 ఫిబ్రవరి 2021న ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
మొత్తం ఎనిమిది అంశాలుగా మార్గదర్శకాలను రూపొందించారు. ప్రస్తుతం ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోయినా కండక్టర్పై క్రమశిక్షణచర్య తీసుకుంటున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం లేకపోయినా ఘటన తీవ్రతను బట్టి సర్వీసు నుంచి తొలగించడం వంటి చర్యలు తీసుకొనేవారు. ప్రభుత్వం తాజాగా రూపొందించిన మార్గదర్శకాలలో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఉద్యోగులు తమకు విధించిన శిక్షలపై డివిజన్ మేనేజర్, రీజినల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయిల్లో అప్పీల్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఆర్టీసీ 348.80 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి దేశంలో తొలిస్థానంలో నిలిచింది. బస్సుల సంఖ్య పరంగా నాలుగో స్థానంలో (10,415) ఉన్నప్పటికీ ఈ ఘనత సాధించింది. 2016-17లో దేశంలోని 56 ప్రభుత్వరంగ రోడ్డు రవాణా సంస్థల పనితీరును విశ్లేషించిన కేంద్ర రహదారి, రవాణాశాఖ ఈ నివేదిక విడుదల చేసింది.
54,117 మంది సిబ్బందితో తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. దేశంలో 49 ఆర్టీసీలు నష్టాల్లో ఉండగా, తెలంగాణ రూ.749 కోట్ల అప్పుతో నాలుగో స్థానంలో ఉంది. 2016-17 నాటికి ఆదాయం రూ.4,295.72 కోట్లు ఉండగా, ఖర్చులు రూ.5044.69 కోట్లు ఉన్నాయి. అలాగే, మొత్తం మూలధనం, అప్పుల విలువ రూ.10,888 కోట్ల మేర ఉంది. ప్రతి ఆర్టీసీ బస్సుపై సగటున రోజుకు రూ.11,300 ఆదాయం వస్తుండగా, ఆ బస్సుపై ప్రతిరోజుకు రూ.13,270 ఖర్చు అవుతున్నది. ప్రతి కిలోమీటరుకు రూ.5.88 పైసల నష్టం వస్తున్నది. ఆర్టీసీ బస్సుల సగటు వయస్సు ఏడున్నర ఏళ్లుగా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి