నిజామాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించనున్న కళాభారతి డిజైన్ను ప్రభుత్వం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో విభిన్న రకాల నమూనాలను రూపొందించగా తుది డిజైన్కు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. భారీ నిర్మాణ శైలిలో కళాభారతి అత్యద్భుతంగా కనిపించేలా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లను వెచ్చించనున్నట్టు చెప్పారు. ఈ నెల 28న ఉదయం 11గంటలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు. ఇప్పటికే కూల్చేసిన పాత కలెక్టరేట్ భవన సమీపంలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగానే కళాభారతి రూపుదిద్దుకుంటున్నదని మంత్రి పేర్కొన్నారు.