హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): వర్ధమాన మహావీరుని జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సహనం, సమ్యక్ జ్ఞానం అనే అంశాలను మానవాళికి బోధించిన మహావీరుని జీవిత సందేశం మనందరికీ ఆదర్శమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ జైన, బౌద్ధ ఆరామాలకు నెలవుగా ఉందని, జైనం తెలంగాణ గడ్డమీద పరిఢవిల్లిందని, జైన తీర్ధంకరుల పాదముద్రలతో తెలంగాణ నేల పావనమైందని వెల్లడించారు. అహింసా పద్ధతిలో పోరాడి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన గాంధీజీ శాంతిమార్గానికి స్ఫూర్తి వర్ధ్దమాన మహావీరుని బోధనలేనని సీఎం తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇతరులకు హాని చేయవద్దనే లక్ష్యంతో సాగిన మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో సబ్బండవర్గాలు అనుసరించిన శాంతియుత పంథాలో జైన తీర్థంకరుల శాంతి, సహనం, బోధనలు అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా సమయం మానవజాతికి ఒక పరీక్షా సమయమని, మహావీరుని బోధనల స్ఫూర్తితో సహనంతో వ్యవహరిస్తూ స్వీయ కట్టుబాట్లు, నిబంధనలను అనుసరిస్తూ కరోనాను జయిద్దామని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.