కొడిమ్యాల(మల్యాల), ఆగస్టు 22: ఆడుకుంటూ వెళ్లి ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో విషాదం నింపింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కరబూజ ఆంజనేయులు, కావ్యశ్రీ దంపతులకు కుమారుడు శశాంక్, కూతురు విజ్ఞశ్రీ (రెండున్నర ఏండ్లు) ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ముందు కూతురు విజ్ఞశ్రీ అడుకుంటుండగా తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడిపోయింది. తల్లిదండ్రులు చూసే సరికే మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.