హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ పర్యటనలో విశాఖ ఉక్కు కార్మికుల పోరాటంపై నోరు మెదపని ప్రధాని మోదీ.. తెలంగాణ పర్యటనలో మాత్రం సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రకటించడంపై ఆసక్తికర చర్చ నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా తెలంగాణలో తన పప్పులు ఉడకవని గ్రహించిన కారణంగానే ఈ విధమైన ప్రకటన చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆంధ్రప్రదేశ్లో తనను వ్యతిరేకించే నాయకుడు లేకపోవడం, తెలంగాణలో కేసీఆర్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఉండటం వల్లనే మోదీ వెనక్కి తగ్గారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడి కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఏడాదికిపైగా పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం గానీ, మోదీ గానీ పట్టించుకోవడం లేదు. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గడం లేదు. కానీ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా నిలబడటంతో మోదీకి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. తెలంగాణలో సీఎం కేసీఆర్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే ప్రధాని ఈ విధమైన ప్రకటన చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గకపోతే కేసీఆర్తో ఇబ్బంది తప్పదన్న సోయితోనే మోదీ ఈ ప్రకటన చేశారనే చర్చ నడుస్తున్నది. ఏపీ పర్యటనలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మౌనం వహించడం, సింగరేణిపై విస్పష్ట ప్రకటన చేయడం ఇందుకు నిదర్శనమని భావిస్తున్నారు.
సింగరేణికి కేసీఆర్ రక్ష
తెలంగాణ నల్లబంగారం సింగరేణిపై కేంద్రం కన్నుపడింది. దీనిని ప్రైవేట్పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కేంద్రం ఎత్తులపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. సింగరేణికి రక్షణగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పోకడలను పసిగట్టిన ఆయన సింగరేణి ప్రైవేటీకరణపై ముందుగానే కార్మికులను హెచ్చరించారు. అందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. ప్రభుత్వం తరఫున పోరాటానికి కూడా సిద్ధమయ్యారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వాటిని సింగరేణికే కేటాయించాలని కేంద్రానికి లేఖలు రాశారు. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయనివ్వబోమని, సంస్థను, కార్మికుల హక్కులను కాపాడేందుకు ఎంతకైనా తెగిస్తామని ప్రకటించారు. ఇలాంటి పరిణామాలు మోదీని వెనక్కి తగ్గేలా చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.