కేవలం రూ.500 కడితే చాలు, లక్కీ డ్రాలో రూ.లక్ష విలువైన బైక్, రూ.2 లక్షల విలువైన టీవీ మీ సొంతం కావొచ్చు. ఆ అదృష్టవంతులు మీరే ఎందుకు కాకూడదు!.. ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలతో డబ్బులు కట్టించుకొని, డిపాజిట్లు కోట్లకు చేరగానే బిచాణా ఎత్తేస్తున్నారు కేటుగాళ్లు. ఉత్తర తెలంగాణలో ఒకచోట మొదలై అన్ని జిల్లాలకు వ్యాపిస్తున్నదీ బోగస్ దందా. ఉచితంగా లాభాలు వస్తాయని నమ్మితే నిండా మునుగుడు ఖాయమనేందుకు ప్రస్తు తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తరిస్తున్న లక్కీ డ్రా ఉదంతమే నిదర్శనం.
నిజామాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం లక్కీ డ్రాలపై నిషేధం విధించింది. గొలుసుకట్టు దందాలపై ఉక్కుపాదం మోపడంతో ఈ వ్యాపారం కనిపించకుండాపోయింది. దీంతో మోసగాళ్లు ఎంటర్ప్రైజెస్ల పేరుతో రిజిస్టర్ చేసుకొని అక్రమ దందా మొదలుపెడుతున్నారు. ఆకర్షణీయమైన బ్రోచర్లతో సామాన్యులను బుట్టలో వేసుకుంటున్నారు. ఏజెంట్లను సైతం నియమించుకొని ప్రతి సభ్యుడి నుంచి రూ.500 నుంచి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. నెలకోసారి, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి లక్కీడ్రా తీస్తామంటూ సభ్యులను పెంచుకుంటూపోతున్నారు. సభ్యుల విశ్వాసం పొందేందుకు మొదట్లో లక్కీ డ్రా తీసి కొంతమందికి బహుమతులు ఇచేస్తున్నారు. పెద్ద మొత్తంలో సభ్యులు చేరి, భారీగా సొమ్ము చేతికందగానే బోర్డు తిప్పేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లక్కీ డ్రాల వ్యాపారం రూ.వందల కోట్లు దాటి ఉండొచ్చని అంచనా. ఇటీవల బిచాణా ఎత్తేసిన ఓ సంస్థ కార్యాలయం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఉండేదన్న ఆరోపణలు వచ్చాయి.
పుట్టగొడుగుల్లా స్కీములు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బోర్డు తిప్పేసిన షైన్ ఎంటర్ప్రైజెస్ రూ.10 కోట్ల వరకు వసూలుచేసి 3 వేలమందిని రోడ్డు పాల్జేసింది. షైన్ ఎంటర్ప్రైజేస్ పేరుతో 4 లక్కీ డ్రాలు నడుస్తుండగా 10 వేల మంది బాధితులున్నట్టు గతంలోనే పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ నగరంలో పురుడు పోసుకున్న ఈ వ్యాపారం నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు పాకింది. కామారెడ్డి జిల్లాలో ఈ దందాను బహిరంగంగానే నడిపిస్తున్నారు. ప్రజల బలహీనతలే ఆసరాగా ఆయా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నప్పటికీ పోలీసులు 420 కేసులు పెట్టి వదిలేయడంతో, మరోచోట మళ్లీ మొదలుపెడుతున్నారు. బీర్షెబా పేరుతో వందల కోట్ల రూపాయల మోసం వెలుగుచూసి ఏడాదిన్నర కూడా కాకముందే ఇప్పుడు లక్కీడ్రాల పేరుతో మోసగాళ్లు కొత్త దుకాణాలు తెరిచారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు అడ్డాగా పురుడు పోసుకుంటోన్న ఈ మోసాలు దాదాపు ఉత్తర తెలంగాణ అంతటా విస్తరిస్తున్నాయి. ఆరునెలల క్రితం నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృతంగా దాడులు నిర్వహించి పలువురు నిందితులను పట్టుకున్నాయి. స్టేషన్ బెయిల్పై వారిని వదిలిపెట్టడంతో నిర్వాహకులు తిరిగి ఇదే వ్యాపారం చేస్తున్నారు. ‘లక్కీ డ్రా నిర్వాహకుల వలకు చిక్కి మోసపోవద్దని ప్రజలను కోరుతున్నాం. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలు ముందుకొచ్చి మోసాలపై ఫిర్యాదు చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కామారెడ్డి డీఎస్పీ సోమనాథ్ పేర్కొన్నారు.
కంచికి చేరిన బీర్షెబా ఉదంతం
ఏడాదిన్నర క్రితం కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన బీర్షెబా ఉదంతంలో పురోగతి ఇప్పటికీ అతీగతీ లేదు. నెలకు రూ.10 వేల చొప్పున మూడు నెలలు కడితే.. పది నెలల పాటు రూ.10 వేల చొప్పున తిరిగి ఇస్తామని బీర్షెబా నిర్వాహకులు నమ్మబలికారు. రూ.30 వేల పెట్టుబడికి అదనంగా రూ.70 వేల లాభం వస్తుందనుకొని వేల మంది ఈ స్కీమ్లో చేరారు. ఏడాదిలోనే మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు ఇది విస్తరించింది. డిపాజిట్లు వందల కోట్లకు చేరగానే గుట్టు చప్పుడు కాకుండా బీర్షెబా సంస్థ మూతపడింది. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తులో వేగం పెంచలేదు.
ఏజెంట్ ద్వారా మోసపోయా
బీర్షెబాలో పెట్టుబడి పెట్టాలని ఏజెంట్లు ఒత్తిడిచేశారు. ఇంటింటికీ తిరిగినప్పుడు నా వద్ద నుంచి రెండు స్కీమ్లు కట్టించుకున్నారు. మూడు నెలలపాటు రెండు స్కీమ్లకు రూ.60 వేలు కడి తే చిల్లిగవ్వ రాలేదు. ఇప్పుడు ఎవరిని అడిగినా స్పందన రావడం లేదు.
– సతీశ్, సంతాయిపేట్(కామారెడ్డి)
అప్పులు చేసి స్కీమ్ కట్టా
బీర్షెబాలో రూ.30 వేలకు రూ.లక్ష వస్తున్నాయంటే పెట్టుబడులు పెట్టా. ఇంటి అవసరాలకు డబ్బులు పనికోస్తాయనే ఆశతో స్కీమ్ తీసుకున్నా. అప్పులు చేసి కట్టిన డబ్బుకు రిటర్న్ ఏమీ రాలేదు. ఈ స్కీమ్లో చేరిన తర్వాత సంస్థ మూతపడింది.
– ఎంకొల్ల రవి, అడ్లూర్(కామారెడ్డి)
సులువుగా వస్తాయంటే నమ్మొద్దు
సులువుగా రెట్టింపు ఆదాయం వస్తుందనే ప్రకటనలను ప్రజలు నమ్మొద్దు. ఒకటికి రెండు సార్లు విషయం తెలుసుకోవాలి. వాస్తవాలు ఏంటో గమనించి ముందుకెళ్లాలి. లక్కీ డ్రా మోసాలను అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడతాం.