హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వాతావరణంలో మార్పులు చీడపీడలకు కారణమవుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో పంటల ది గుబడి, సాగు విధానాలు, వాతావరణంలో మార్పులు వంటి అంశాలపై ఇక్రిసాట్ అధ్యయనం చేసింది. ఏటా కలుగుతున్న మార్పు లు దిగుబడిని తగ్గించడమే కాకుండా, చీడపీడల తీవ్రతను పెంచుతున్నట్టు తేలింది. ఆహార ఉత్పత్తులు, ఆహార భద్రత సాధించడమే లక్ష్యంగా అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో పర్యావరణ మార్పుల ప్రభావం కీలకంగా మారనున్నది. వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల ప్రభావం నానాటికి పెరుగుతున్నది. ఓ వైపు జనాభా పెరుగుతుంటే మరోవైపు పంటల విస్తీర్ణం తగ్గుతున్నది.
జనాభా అవసరాలకు అనుగుణంగా పంటల ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఏర్పడుతున్నది. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న క్రమంలో ఏటా వేల ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లుతున్నది. వాతావరణంలో మార్పులతోపాటు అధికంగా వినియోగిస్తున్న కృత్రిమ ఎరువులు కూడా చీడపీడలకు కారణం అవుతున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని పంటల కోసం కొత్త వంగడాలు రూపకల్పన చేసినా.. పంటల దిగుబడి ఆశించిన మేర పెరగడం లేదనే భావన ఉన్నది. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ర్టాల్లో ఇక్రిసాట్ అధ్యయనం చేస్తుండటంతోపాటు, అభివృద్ధి చేసిన నూతన వంగడాలతో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్టు ఇక్రిసాట్ వర్గాలు వెల్లడించాయి.