అది 1928. గుజరాత్ సూరత్ జిల్లాలోని బర్దోలి తాలూకా. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భూమిశిస్తును 30 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తపతి నది పరీవాహక ప్రాంతంలో రైలు మార్గం రావడంతో.. ఇక్కడి రైతుల పరిస్థితి, ఆదాయం పెరిగిందని ఓ అధికారి ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని ఈ నిర్ణయం తీసుకొన్నది. కానీ, వాస్తవంగా రైతుల పరిస్థితి మరింతగా దిగజారింది. దీంతో శిస్తు కట్టలేని రైతన్నలు అప్పటికే, రైతుల పక్షాన ఉద్యమాలు చేస్తున్న వల్లభ్భాయ్ పటేల్ను ఆశ్రయించారు. రైతులతో కలిసి ఆయన బర్దోలీ సత్యాగ్రహానికి అంకురార్పణ చేశారు. పొలంపనులు మానేసి వందలాది గ్రామాల్లో అన్నదాతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఊళ్లల్లోకి బ్రిటిషర్లను రానిచ్చేవారు కాదు. ఉద్యమం ఉధృతం కావడంతో ఎట్టకేలకు బ్రిటిష్ ప్రభుత్వం రైతన్నల కాళ్లదగ్గరికి వచ్చింది. ఆదేశాలను వెనక్కి తీసుకొన్నది. అప్పటి నుంచే రైతన్నలు వల్లభ్భాయ్ పటేల్ను ఆప్యాయంగా ‘సర్దార్’ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు.
ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వాదించినట్టుగానే ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా వాదిస్తున్నది. రైతుల ఆదాయం పెరిగిందని చెబుతూ వారిపై పన్నువేయాలని ప్రతిపాదిస్తున్నది.
ఇప్పుడు రైతుల తరఫున పోరాడేందుకు మరో సర్దార్ కావాలి
సర్దార్ను పూజించటం అంటే ఆయన బాటలో నడవడమే విగ్రహాలు పెట్టడం కాదు.
‘2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం’ ఇది అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ. 2022 వెళ్లి పోయింది. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు సరికదా! డీజిల్ ధర పెంపు వల్ల పెట్టుబడి ఖర్చులు డబుల్ అయ్యాయి.
వద్దు వద్దంటున్నా మోదీ ప్రభుత్వం రైతులపై కత్తిగట్టి మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చింది. దాదాపు ఏడాదిపాటు రైతులను నడిరోడ్డుపై నిలబెట్టి 750 ప్రాణాలను బలిగొంది. తప్పనిసరై యూపీ ఎన్నికల కోసం ఆ చట్టాలను ఉపసంహరించుకున్నట్టు చెప్పినా, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం ఇప్పటి వరకూ నెరవేర్చలేదు.
విద్యుత్తు సంస్కరణల పేరుతో మోదీ ప్రభుత్వంరైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాల మెడపై కత్తి వేలాడదీసింది. ఏపీ, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల కొన్ని జిల్లాల్లో మీటర్లు పెట్టడమూ మొదలైంది. అక్కడి రైతులు వాటన్నింటిని ఊడబీకి బద్దలు కొట్టిన దృశ్యాలు మీడియాలో వచ్చాయి.
రైతులకు దిగుబడి గిట్టుబాటు కావడంలేదని మద్దతు ధరలు పెంచి తప్పనిసరిగా అమలయ్యేట్టు చూడాలని లేదా ఫలసాయం ధర నిర్ణయించుకునే అధికారాన్ని రైతుకే ఇవ్వాలని వ్యవసాయ నిపుణులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయంపై ప్రముఖ శాస్త్రవేత్త స్వామినాథన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదు.
మోదీ నీకో దండం.. రైతుకు ఇదేమి గండం
ఇవన్నీ చాలవన్నట్టు.. మోదీ ప్రభుత్వం ఇప్పుడు రైతుల ఆదాయంపై పన్ను వేయాలని ఆలోచిస్తున్నదా? ఈ మేరకు ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలి కసరత్తు చేస్తున్నదా? దేశంలో 60% మంది ఆధారపడి ఉన్న వ్యవసాయాన్ని పన్ను పరిధిలోకి తేనున్నదా? ఏకంగా ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ ‘న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రికలో రాసిన ఒక వ్యాసం ఈ అనుమానాలనే కలిగిస్తున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయంపై పన్ను వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నదా? ఇంగ్లిష్ దినపత్రిక ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ పేజీలో శనివారం ‘ది నెస్సెసిటీ ఆఫ్ ట్యాక్సింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఇన్ ఇండియా’ పేరిట శనివారం ప్రచురితమైన వ్యాసం చదివితే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. పైగా, ఈ వ్యాసం రాసింది పీఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ కావడంతో ఇది చర్చనీయాంశమైంది.
ఇంతకీ ఆ వ్యాసంలో బిబేక్ దేబ్రాయ్ ఏం రాశారంటే, భూమిపై ఉన్న అత్యంత సంపన్న గ్రామాలు భారత్లోనే ఉన్నాయని, అలాంటప్పుడు వ్యవసాయం ద్వారా రైతులకొచ్చే ఆదాయంపై పన్ను ఎందుకు విధించకూడదని దేబ్రాయ్ ప్రశ్నించారు. రైతుల ఆదాయంపై పన్ను విధించకపోవడం తప్పేనని తేల్చి చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 కంటే ముందుతో పోలిస్తే, ప్రస్తుతం రైతులు ఇంకా పేదోళ్లుగానే ఉన్నారా? అని మరో వింత ప్రశ్న వేశారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆర్థిక శాఖలో తొలిసభ్యుడైన జేమ్స్ విల్సన్ ప్రస్తావననూ తీసుకొచ్చారు.
1860లో రైతుల ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను విల్సన్ తీసుకొచ్చారని దేబ్రాయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పటితో పోలిస్తే ఇప్పటి రైతులు మరింత పేదోళ్లా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. 1938లో బీహార్, 1939లో అస్సాంలో, 1944లో బెంగాల్లో, 1948లో ఒడిశా, యూపీలో, 1950లో హైదరాబాద్లో, 1951లో ట్రావెన్కోర్, కొచ్చిన్లో, 1955లో మద్రాస్, ఓల్డ్ మైసూర్ రాష్ట్రంలో అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను అమలు చేశారని, ఇప్పటితో పోలిస్తే, అప్పటి రైతుల ఆదాయంపై పన్ను విధించాలని ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు కూడా సిఫారసులు చేశాయని ఏకరువు పెట్టారు.
ట్యాక్సేషన్ ఎంక్వైరీ కమిషన్ (1953-54), రాజ్ కమిటీ ఆన్ ట్యాక్సేషన్ ఆఫ్ అగ్రికల్చర్ వెల్త్ అండ్ ఇన్కమ్(1972), నాల్గవ పంచవర్ష ప్రణాళిక (1969-74), ఐదవ ఆర్థిక సంఘం నివేదిక (1969), ట్యాక్స్ రీఫార్మ్స్ కమిటీ (1991), కేల్కర్ టాస్క్ ఫోర్స్ ఆన్ డైరెక్ట్ ట్యాక్సెస్ (2002), వైట్ పేపర్ ఆన్ బ్లాక్ మనీ (2012), టాక్స్ అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్ కమిషన్ (2014) ఇలా చాంతాడంత నివేదికల పేర్లను పొందుపరిచారు. 1960 వరకు రైతుల ఆదాయంపై పన్ను వసూలుకు సుముఖమైన వాతావరణం ఉన్నప్పటికీ, 1970ల తర్వాత పరిస్థితి మారిందని చెప్పుకొచ్చారు. రాజకీయ వత్తిళ్లే దీనికి కారణంగా అనుమానం వ్యక్తం చేస్తూ సొంత విశ్లేషణ చేశారు. ఇక, చివరగా వ్యవసాయం ద్వారా రైతులకు వచ్చే ఆదాయంపై పన్ను విధించే నిర్ణయం రాష్ర్టాల పరిధిలోనిదని, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చిచ్చు పెట్టారు.
రైతన్న ఆదాయం నిజంగా పెరిగిందా?
‘2022 చివరి నాటికి దేశంలోని ప్రతీ అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తా’ అంటూ 2016లో యూపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఘనంగా ప్రకటించారు. అయితే, ఇది ఇప్పటికీ జరుగలేదు. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం చేరుకోవాలంటే, రైతుల నెలవారీ ఆదాయం రూ.21,146గా ఉండాలి. కానీ, 2021-22 నాటికి రైతుల ఆదాయం కేవలం రూ.12,952 మాత్రమే. అంటే, ఇంకా రూ.8,194 ఆదాయం తక్కువగా ఉన్నది. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే, పండించిన పంటకు మద్దతు ధర రెట్టింపు కావాలి. ఇదే సమయంలో పెట్టుబడి ఖర్చు తగ్గాలి. కానీ, డీజిల్, ఎరువుల రేట్లు 30-40 శాతం పెరిగి పెట్టుబడి ఖర్చు రెట్టింపు అయ్యింది. గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో మద్దతు ధర కేవలం 6శాతంలోపే పెరిగింది. దీంతో రైతుల ఆదాయం రెట్టింపవ్వడం అటుంచితే, పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి స్థితిలో రైతుల ఆదాయంపై పన్ను విధించాలంటూ దేబ్రాయ్ ఇస్తున్న ఉచిత సలహాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ర్టాలపై కుట్ర?!
రైతులకు వచ్చే ఆదాయంపై పన్ను విధించే నిర్ణయం రాష్ర్టాల పరిధిలోని అంశమని, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని బిబేక్ దేబ్రాయ్ ఇచ్చిన సలహాపై పలువురు మండిపడుతున్నారు. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను బద్నాం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం చేసిన కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. దేబ్రాయ్ సలహామేరకు ఒకవేళ రైతుల ఆదాయంపై పన్ను విధించే నిర్ణయాన్ని విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటే, ఆయా రాష్ర్టాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీజేపీ నేతలే ముందుగా ఆందోళనలకు దిగుతారని ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు, రైతన్నలకు మధ్య గొడవలు పెట్టే కుట్ర ఇదంటూ నిప్పులు చెరుగుతున్నారు.
పీఎం ఆర్థిక సలహా మండలి విధులేంటి?
పీఎం ఆర్థిక సలహా మండలి అనేది రాజ్యంగబద్ధ సంస్థ కాదు. ఆర్థిక రంగంలో భారత ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రికి సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకునే ఓ స్వతంత్ర సంస్థ. ఇదేం శాశ్వతమైన సంస్థ కూడా కాదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆర్థిక సలహా మండలి పలుమార్లు ఏర్పాటవుతూ వస్తున్నది. ప్రస్తుతం ఈ మండలికి చైర్మన్ గా బిబేక్ దేబ్రాయ్ వ్యవహరిస్తున్నారు. ఇందులో ఆయనతో పాటు మరికొంత మంది ఆర్థిక వేత్తలు కూడా సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చక్రవర్తి రంగరాజన్ నేతృత్వంలో ఆర్థిక సలహా మండలి ఉండేది. 2014 ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆర్థిక సలహా మండలి కూడా రద్దయ్యింది.
ఆ తర్వాత సెప్టెంబర్ 25, 2017లో ఈ మండలిని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్దరించారు. దేశం ఎదుర్కొనే అతి కీలక ఆర్థిక సమస్యలపై అధ్యయనం చేసి తగిన సలహాలను భారత ప్రభుత్వానికి అందచేయడం ఈ సలహా మండలి ప్రధాన బాధ్యత. ద్రవ్యోల్బణం, సూక్ష్మ ఆర్థిక వ్యవహారాలు, పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రధానికి సలహాలివ్వడం కూడా దీని బాధ్యతే. అదనంగా ఆర్థికాభివృద్ధిపై ప్రతి నెలా ప్రధానికి నివేదిక సమర్పించాలి. జాతీయ,అంతర్జాతీయంగా ఆర్థికరంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ తదనుగుణంగా తగిన పాలసీలను రూపొందించాల్సి ఉంటుంది. ఆర్థిక సలహా మండలికి చైర్మన్తోపాటు మరికొంత మంది ఆర్థిక వేత్తలు సభ్యులుగా ఉంటారు. సభ్యుల సంఖ్యపై ఎలాంటి పరిమితీ ఉండదు. తన హయాంలో ఆర్థిక సలహా మండలికి తానే చైర్మన్గా వ్యవహరించారు అటల్ బిహారీ వాజాపేయి.
బిబేక్ దేబ్రాయ్కు సామాన్యుల చురకలు..
మీరు రాష్ర్టాలకు సలహాదారా?
దేబ్రాయ్ సార్, పీఎంకు ఆర్థిక సలహాలిచ్చే మండలికి మీరు ఛైర్మన్ కదా? రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలిస్తున్నారేంటి?
– పుల్కిత్, నోయిడా
అప్పుడు రైతుల దగ్గర భూమెక్కడిది?
1860లో రైతుల ఆదాయంపై పన్ను వేశారా? అసలు అప్పుడు రైతన్నలకు భూమెక్కడిది? జమీందార్లు, భూస్వాముల దగ్గర వీళ్లు వ్యవసాయ కూలీలుగా పనిచేశారుగా. ముందు భారత రైతాంగం చరిత్ర తెలుసుకోండి!
– శివకుమార్, వేములవాడ
ప్రధానే మీతో చెప్పించారా?
పీఎంకు ఆర్థిక సలహాలిచ్చే మండలికి ఛైర్మన్ అయిన మీరు, ప్రధాని అనుమతి లేకుండానే ఈ వ్యాసం రాశారా? రైతుల ఆదాయంపై పన్ను వేయాలన్న ఆలోచన మీదా? మోదీ సార్దా?
– సుశోభిత్, న్యూఢిల్లీ