సికింద్రాబాద్, జూన్ 9: ఒకడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. మరొకడు ప్రేమ, పెండ్లి పేరిట మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఇద్దరూ వేర్వేరుగా మైనర్ అక్కాచెల్లెళ్లపై లైంగికదాడికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి గురువారం అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. నార్త్జోన్ చిలుకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలను గోపాలపురం ఏసీపీ సుధీర్, చిలకలగూడ సీఐ నరేశ్ మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి మొదట అంబర్పేటలో.. తరువాత బౌద్ధనగర్ డివిజన్ అంబర్నగర్లో అద్దెకు నివాసముంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె (మైనర్)కు కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రాం ద్వారా అంబర్పేట లాల్బాగ్కు చెందిన మహ్మద్ నవాజ్ (21) పరిచయమయ్యాడు. చాటింగ్, ఫోన్లు చేస్తూ మరింత దగ్గరయ్యాడు. అవకాశం చూసుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. అంబర్పేట జిందా తిలిస్మాత్ కంపెనీ సమీపంలో నివసిస్తున్న మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్ (23) రెండో కుమార్తె (మైనర్)కు పరిచయమయ్యాడు. ఆమెకు ప్రేమ, పెండ్లి పేరుతో మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. కొన్నేండ్లుగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తల్లితండ్రులకు తెలియడంతో.. ఈ నెల 8న చిలుకలగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు పలు సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు ఇరువురిని గురువారం ఉదయం అంబర్పేటలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నిందితులు పాత నేరస్థులు
మైనర్లపై లైంగికదాడికి పాల్పడిన కేసులో ఇరువురు నిందితులు పాత నేరస్థులే. పీడీ యాక్ట్ ప్రకారం జైలుశిక్ష అనుభవించినవారే కావడం గమనార్హం. ఆటోడ్రైవర్ అయిన మహ్మద్ నవాజ్పై మలక్పేట, అంబర్పేట పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు పెండింగ్లో ఉన్నాయి. పీడీ యాక్టు ప్రకారం శిక్ష అనుభవించి 2021 సెప్టెంబర్ 9న జైలు నుంచి విడుదలయ్యాడు. వృతిరీత్యా ప్లంబర్ అయిన మరో నిందితుడు మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్పై చిక్కడపల్లి, బేగంపేట, నల్లకుంట, చిలకలగూడ, ముషీరాబాద్, పంజగుట్ట, కాచిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో 23 కేసులు పెండింగ్లో ఉన్నాయి.